హైదరాబాద్: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా రాణించడంతో రంజీల్లో గుజరాత్ జట్టు 65 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. జార్ఖండ్తో జరిగిన రెండో రంజీ సెమీ ఫైనల్ మ్యాచ్లో 123 పరుగుల తేడాతో విజయం సాధించిన గుజరాత్ పైనల్స్కు అర్హత సాధించింది. విజయంతో గుజరాత్ జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్స్కు రెండోసారి అర్హత సాధించినట్లైంది.
1950-51 సీజన్ తర్వాత గుజరాత్ రంజీ ఫైనల్స్కు అర్హత సాధించడం ఇదే మొదటిసారి. 235 పరుగుల విజయ లక్ష్యంతో నాలుగో రోజు బరిలోకి దిగిన జార్ఖండ్ 41 ఓవర్లు ఆడి 111 పరుగులకు ఆలౌటైంది. 14 ఓవర్లు వేసిన బుమ్రా 29 పరుగులిచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. బుమ్రాకి తోడు మరో పేసర్ ఆర్పీ సింగ్ కూడా సత్తా చాటాడు.

12 ఓవర్లు వేసిన ఆర్పీ సింగ్ 25 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. పార్ధీవ్ నేతృత్వంలోని గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 390 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన జార్ఖండ్ 408 పరుగులకే ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన గుజరాత్ జట్టు 81 ఓవర్లు ఆడి 252 పరుగులు చేసిన ఆలౌటైంది.
గుజరాత్ ఆటగాడు చిరాగ్ గాంధీ అర్ధసెంచరీని నమోదు చేశాడు. అనంతరం 235 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జార్ఖండ్ జట్టులో ఓపెనర్లు ప్రత్యూష్ సింగ్, సుమిత్ కుమార్ డకౌట్లుగా వెనుదిరిగారు. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన జార్ఖండ్ చివరకు కోలుకోలేదు. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ జట్టు తమిళనాడు లేదా ముంబైతో తలపడనుంది.
స్కోరు వివరాలు:
తొలి ఇన్నింగ్స్:
గుజరాత్ - 390
జార్ఖండ్ - 408
రెండో ఇన్నింగ్స్:
గుజరాత్ - 252
జార్ఖండ్ - 111 ఆలౌట్
మ్యాచ్ ఫలితం: 123 పరుగుల తేడాతో గుజరాత్ విజయం