హైదరాబాద్: క్రికెట్లో చివరి బంతికి సిక్స్ బాది మ్యాచ్ గెలిచిన సందర్భాలు అనేక. గతేడాది శ్రీలంక వేదికగా జరిగిన నిదాహాస్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా బ్యాట్స్మన్ దినేశ్ కార్తిక్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి టీమిండియాకు విజయాన్ని అందించిన సంఘటన క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ గుర్తే.
తాజాగా, రెండు రోజుల క్రితం జరిగిన ఓ క్లబ్ క్రికెట్ మ్యాచ్లో ఆఖరి బంతికి గెలవాలంటే 6 పరుగులు అవసరమయ్యాయి. అయితే, క్రీజులో ఉన్న బ్యాట్స్మన్ ఒక్క పరుగు కూడా తీయకుండానే, ఆరు పరుగులు రావడం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే.. ఆదర్శ్ క్రికెట్ క్లబ్(మహారాష్ట్ర) నిర్వహించిన క్రికెట్ పోటీల్లో భాగంగా దేశాయ్-జుని డోంబివ్లి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఇది ఐదు ఓవర్ల మ్యాచ్ కాగా, దేశాయ్ 4.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. 76 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దేశాయ్ జట్టు విజయానికి ఆఖరి బంతికి 6 పరుగులు అవసరమయ్యాయి. ఒకే బంతి మిగిలి ఉండటంతో ఇటు అభిమానులకు, అటు ఆటగాళ్లకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఈ క్రమంలో మొదటి బంతి పడింది.. అది కాస్త వైడ్. రెండో బంతి పడింది అది కూడా వైడ్. అలా ఆరు వైడ్లు పడడంతో ఆఖరు బంతి ఆడకుండానే ఆరు పరుగులు దేశాయ్ జట్టు ఖాతాలో చేరాయి. దీంతో మరో బంతి మిగిలి ఉండగానే జుని జట్టుపై దేశాయ్ జట్టు విజయం సాధించింది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
6 runs needed off 1 ball and the team scored it with 1 ball to spare 😂 pic.twitter.com/XOehccVBzA
— Amit A (@Amit_smiling) January 8, 2019