చెన్నై: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చెన్నైలో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. దీంతో భారత్ తరుపున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నాయర్ గుర్తింపు పొందాడు. తన కెరీర్లో మూడో టెస్టు ఆడుతున్న నాయర్కి ఇది తొలి ట్రిపుల్ సెంచరీ.
299 పరుగుల వద్ద ఇంగ్లాండ్ బౌలర్ అదిల్ రషీద్ బౌలింగ్లో ఫోర్తో 303 పరుగులు చేశాడు. 381 బంతులు ఎదుర్కొన్న నాయర్ 32 ఫోర్లు, 4 సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. తద్వారా ట్రిపుల్ సెంచరీ సాధించిన యంగెస్ట్ క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో సాధించిన తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలచిన తొలి భారత బ్యాట్స్ మన్గా కరుణ్ నాయర్ చరిత్ర సృష్టించాడు.

టెస్టు క్రికెట్ చరిత్రలో గ్యారీ సోబర్స్, బాబ్ సింప్సన్ తర్వాత తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మార్చిన మూడో ప్లేయర్ కరుణ్ నాయర్ కావడం గమనార్హం. ఇదిలా ఉంటే భారత్ తరుపున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక బ్యాట్స్ మెన్గా గత 12 సంవత్సరాలుగా సెహ్వాగ్ కొనసాగుతున్నాడు.
తాజాగా చెన్నై టెస్టులో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించడంతో ఎలైట్ గ్రూపులో చేరాడు. మరోవైపు చెన్నై టెస్టులో భారీ స్కోరుని సాధించడం ద్వారా టెస్టుల్లో భారత్ అత్యధిక స్కోరుని సాధించింది. గతంలో టెస్టుల్లో భారత్ అత్యధిక స్కోరు 726గా ఉంది. ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది.
ఇదిలా ఉంటే చెన్నై టెస్టులో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే 759 పరుగుల వద్ద భారత్ తన తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు 282 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లాండ్పై ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు కావడం మరో రికార్డు.
చెన్నై టెస్టులో నాయర్ ఇంగ్లాండ్ బౌలర్లపై తన ప్రతాపం చూపించాడు. 381 బంతుల్లో 303 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇంతకుముందు భారత్ తరఫున సెహ్వాగ్ రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. సెహ్వాగ్ కూడా ఇదే చెన్నై స్టేడియంలో తన అత్యధిక స్కోరు (319) పరుగులు చేయడం విశేషం.
తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మార్చిన మూడో భారత బ్యాట్స్మన్గా నాయర్ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. గతంలో వినోద్ కాంబ్లి(224), దిలీప్ సర్దేశాయ్(200 నాటౌట్) ఈ ఘనత సాధించారు. మొత్తం మీద టెస్టు క్రికెట్లో ఈ ఘనత సాధించిన 31వ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఈ క్రమంలో నాయర్ 250 పరుగుల మైలురాయిని అందుకొని.. అరుదైన క్లబ్లో చోటు సంపాదించాడు. సెహ్వాగ్, లక్ష్మణ్, ద్రవిడ్ తర్వాత టెస్టుల్లో 250కి పైగా స్కోరు చేసిన భారత బ్యాట్స్ మన్గా నిలిచాడు. మరోవైపు ఇంగ్లాండ్పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాట్స్ మన్గా నాయర్ గుర్తింపు పొందాడు.
అంతకముందు వరకు 235 పరుగులతో కోహ్లి పేరు మీదున్న రికార్డును కరుణ్ నాయర్ బద్దలు కొట్టాడు. అశ్విన్ (67)తో కలిసి నాయర్ ఆరో వికెట్కు 181 పరుగులు, జడేజా(51)తో కలిసి ఏడో వికెట్కు 138 పరుగులు జోడించాడు. 300 పరుగుల క్లబ్లోకి చేరిన నాయర్కు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ శుభాకాంక్షలు తెలిపాడు.