
హైదరాబాద్: రాబోయే ఐపీఎల్ సీజన్కు గాను ఏర్పాట్లన్నీ ముందుగానే సిద్ధమైపోతున్నాయి. ఈ విషయంలో అన్ని జట్ల కంటే ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఉందనే చెప్పాలి. ఐపీఎల్ సీజన్ గురించి ప్రతి విషయంలోనూ తమిళనాడు నుంచే ఎక్కువ స్పందన వస్తోంది. రెండేళ్ల నుంచి నిషేదానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎంపికకు ఆటగాళ్లు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
ఈ విషయమై ఇప్పటికే 53మంది ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ఈ నమోదు ప్రక్రియ చేసుకున్న వాళ్లంతా రెండేళ్ల నుంచి తమిళనాడులో జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్లో పాల్గొన్న ఆటగాళ్లే. ఇప్పటికే ప్రదాన ఆటగాళ్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరేందుకు సుముఖత చూపిస్తూ వారి ధరను ప్రకటించిన సంగతి తెలిసిందే. అశ్విన్, దినేశ్ కార్తీక్, మురళీ విజయ్ రెండు కోట్లుగా ప్రకటించారు. యువ ఫేసర్ వాషింగ్టన్ సుందర్ 1.5 కోట్లుగా తెలుపగా రంజీ ట్రోఫీ క్రీడలో ఆడిన అభినవ్ ముకుంద 50లక్షలుగా ప్రకటించారు.
శుక్రవారం జరిగిన సీఎస్కే ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ.. 'వేలంలో అశ్విన్ను తప్పక దక్కించుకుంటాం. అతడు లోకల్ ప్లేయర్. చెన్నై సూపర్ కింగ్స్లో ఎక్కువ మంది లోకల్ ప్లేయర్లు ఉండాలని కోరుకుంటున్నా. వీరితో పాటు చెన్నై జట్టు మాజీ ఆటగాళ్లు బ్రెండన్ మెక్కల్లమ్, డుప్లెసిస్, డ్వేన్ బ్రావోలను కూడా వేలంలో కోనుగోలు చేస్తాం. ప్రస్తుతం మా వద్ద రెండు రైట్ టు మ్యాచ్ కార్డులు ఉన్నాయి. వాటిని ఎప్పుడు ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలుసు' అని ధోని అన్నాడు.
'అయితే అశ్విన్ కోసం రైట్ టు మ్యాచ్ కార్డు వినియోగించం. ఎందుకంటే ఇప్పటికే జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉన్నారు. వేలంలోనే అతడిని కోనుగోలు చేస్తాం. అంతేకాదు వేలంలో ఒక్కో ఆటగాడికి ఎంత మనీ ఖర్చు పెట్టగలమో, అదే విధంగా బలమైన జట్టుని తయారు చేసేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం' అని ధోని పేర్కొన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.