
టాస్తో బిగిన్..
టాస్ గెలవడం.. భారత్కు శుభసూచకాన్ని ఇచ్చినట్టయింది. సౌతాంప్టన్ స్టేడియంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ పెట్టింది. 198 పరుగుల టార్గెట్ అది. ఆరంభం నుంచే స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 2.5 ఓవర్ల వద్ద తొలి వికెట్ రూపంలో రోహిత్ శర్మ అవుట్ అయ్యే సమయానికి జట్టు స్కోర్ 29 పరుగులు. 14 బంతుల్లో అయిదు ఫోర్లు బాదాడు హిట్మ్యాన్. 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ త్వరగానే అవుట్ అయినప్పటికీ.. టాప్ ఆర్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు.

అదరగొట్టిన హార్దిక్ పాండ్యా
తాను ఎంత విలువైన ప్లేయర్ అనేది హార్దిక్ పాండ్యా మరోసారి నిరూపించుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్లో చెలరేగాడు. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్, ఐర్లాండ్ దూకుడును ఇక్కడా కంటిన్యూ చేశాడు. 33 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్తో 51 పరుగులు సాధించాడు. బౌలర్గానూ తిరుగులేదనిపించుకున్నాడు. నాలుగు ఓవర్లల్లో 33 పరుగులు ఇచ్చి.. నాలుగు వికెట్లు నేలకూల్చాడు. జేసన్ రాయ్, డేవిడ్ మలన్, లియామ్ లివింగ్స్టొన్, సామ్ కుర్రన్లను పెవిలియన్ దారి పట్టించాడు. ఈ నలుగురు టీ20 స్పెషలిస్టులే.

బట్లర్.. గోల్డెన్ డక్
తొలి ఓవర్లోనే భువనేశ్వర్ కుమార్ వికెట్ తీసుకున్నాడు. అక్కడే టీమిండియా.. సగం మ్యాచ్ గెలిచినట్టయింది. ఆ వికెట్ కూడా కేప్టెన్ జోస్ బట్లర్ది. ఐపీఎల్ 2022లో బట్లర్ ఎలా ఆడాడో చూశాం. అలాంటి బ్యాటర్ను తొలి బంతికే వెనక్కి పంపాడు భువి. అప్పటివరకు జేసన్ రాయ్కు నాలుగు అవుట్ స్వింగ్లర్లను వేశాడు భువి. స్ట్రైకింగ్ ఎండ్లోకి వచ్చిన బట్లర్కు బంతిని మార్చాడు. ఇన్స్వింగర్ సంధించాడు. ఆఫ్ స్టంప్ మీద పడ్డ బంతి షార్ప్గా ఇన్స్వింగ్ అయింది. దాన్ని ఫ్లిక్ చేయడంలో లేట్ చేశాడు బట్లర్. ఈలోగా బంతి లెగ్ స్టంప్ను ఎగురగొట్టింది. ఐపీఎల్ 2022లో అదరగొట్టిన మరో బ్యాటర్ లియామ్ లివింగ్స్టొన్ కూడా డకౌట్ కావడం ఇంగ్లాండ్ పరాజయానికి దారి తీసింది

రోహిత్ కేప్టెన్సీ..
ఐపీఎల్ తరువాత రెస్ట్ తీసుకుని టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ.. తన కేప్టెన్సీ మెరుపులు తగ్గలేదని ఈ మ్యాచ్తో నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ను ఘోరంగా పరాజయాల బాట పట్టించడం వల్ల రోహిత్ శర్మ కేప్టెన్సీపై అప్పట్లో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వాటన్నింటినీ తన కేప్టెన్సీతో పటాపంచలు చేశాడు. బౌలింగ్ వనరులను సమర్థవంతంగా వినియోగించుకున్నాడు. ఓపెనర్గా సత్తా చాటాడు. 14 బంతుల్లో అయిదు ఫోర్లు బాదాడు. 24 పరుగులు చేశాడు. జట్టు భారీ స్కోర్ సాధించడానికి పునాది వేశాడు.

సమష్టిగా రాణించిన బౌలర్లు..
భారత బౌలర్లు సమష్టిగా రాణించారు. ఒక్క అక్షర్ పటేల్ మినహా మిగిలిన వారందరూ వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్తో అరంగేట్రం చేసిన అర్ష్దీప్ సింగ్ రెండు వికెట్లు కూల్చాడు. హార్దిక్ పాండ్యా-4, యజువేంద్ర చాహల్-2, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. క్రీజ్లో కుదురుకునే అవకాశం ఏ ఒక్క బ్యాటర్కూ ఇవ్వలేదు. వరుసగా ఒత్తిడి పెంచారు. అక్షర్ పటేల్ బౌలింగ్లో మాత్రమే కాస్త పరుగులు రాబట్టుకోగలిగారు ఇంగ్లాండ్ బ్యాటర్లు. రెండు ఓవర్లల్లో 23 పరుగులు ఇచ్చుకున్నాడు.


Click it and Unblock the Notifications












