
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021కి కరోనా సెగ తాకినట్లే కనబడుతోంది. బయో బబుల్ వాతావరణంలో ఐపీఎల్ను నిర్వహిస్తున్నా.. సోమవారం కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లలో ఇద్దరికి కరోనా సోకడం, ఆపై ఆ జట్టంతా ఐసోలేషన్లోకి వెళ్లడం చకచకా జరిగాయి. దీంతో ఈ రోజు (మే3వ తేదీ) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. ఆ మ్యాచ్ను ఎప్పుడు నిర్వహిస్తారనే విషయం బీసీసీఐ ఇంకా స్పష్టం చేయలేదు. కేకేఆర్ జట్టులో కరోనా కేసులు ఉన్న విషయం తెలిసిన గంటల వ్యవధిలోనే చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటేతర సిబ్బంది ముగ్గురు వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆ జట్టు ప్రాక్టీస్ రద్దు చేసుకుంది.
తాజాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదాన సిబ్బంది ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వారందరూ ఐసొలేషన్కు వెళ్లిపోయారట. ఢిల్లీ వైద్య బృందం వారికి ప్రత్యేక చికిత్స అందిస్తోంది. బయో బబుల్ వాతావరణంలో ఉన్నా కూడా ఏకంగా ఐదుగురికి వైరస్ సోకడం ఇప్పుడు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ పెద్దల్లో ఆందోళన మొదలైంది. ఇక మంగళవారం ఢిల్లీలో జరిగే సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచుపైనా సందిగ్ధం నెలకొంది. మ్యాచ్ జరిగేది లేనిది రేపటి లోగా తేలనుంది. రాజస్థాన్, ముంబై, హైదరాబాద్, చెన్నై జట్లు మ్యాచుల కోసం మే 8 వరకు ఢిల్లీలోనే ఉండనున్నాయి.
ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంలో ముంబై మైదానం సిబ్బంది పదుల సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడ్డారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్, కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్ నితీశ్ రాణా వంటి ఆటగాళ్లూ కూడా పాజిటివ్గా తేలారు. అయినప్పటికీ ఐపీఎల్ పాలక మండలి టోర్నీని కొనసాగించేందుకే మొగ్గు చూపింది. ఇప్పటికే సగం టోర్నీ ముగియగా.. బయో బుడగ పటిష్ఠంగానే ఉండటంతో బోర్డు ఊపిరి పీల్చుకుంది. ఉన్నపళంగా కరోనా కేసులు రావడంతో బీసీసీఐ తలపట్టుకుంది.
భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో ఐపీఎల్ లీగ్ నిర్వహించాల్సిన అవసరం ఏముందని ఇప్పటికే పలు రంగాలకు చెందిన ప్రముఖులు, పత్రికలు, ఛానెళ్లు విమర్శించాయి. తాజాగా ఆటగాళ్లకు వైరస్ సోకడంతో ఐపీఎల్ను వాయిదా లేదా రద్దు చేయాలంటూ బీసీసీఐపై ఒత్తిడి పెరుగుతోంది. విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహణను చాలా మంది తప్పబడుతున్నారు. ఐపీఎల్ను వెంటనే రద్దు చేయాలంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.