తమిళనాడు ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాటర్ నారాయణ్ జగదీశన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం జరుగుతోన్న విజయ్ హజారే ట్రోఫీలో తన అద్బుతమైన ప్రదర్శనతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో జగదీశన్ ఒకే ఓవర్ లో వరుసగా 6 ఫోర్లు బాది అందర్నీ ఆశ్చర్యపరిశాడు.
బరోడా వేదికగా ఈ ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ పోరులో తొలి ఇన్నింగ్స్ లో రాజస్థాన్ 267 పరుగులు చేసింది. అనంతరం 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు జట్టులో జగదీశన్ స్టన్నింగ్ పెర్ ఫార్మెన్స్ చేశాడు. రాజస్థాన్ పేసర్ అమన్ సింగ్ షెకావత్ వేసిన రెండో ఓవర్ లో 29 పరుగులు చేశాడు. ఈ ఓవర్ లో తొలి బంతి వైడ్ వేయగా అది బౌండరీ వెళ్లింది. అలా వైడ్ డెలివరీ బౌండరీతో మొదలైన ఈ ఓవర్ లో జగదీశన్ ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరుసగా ఆరు ఫోర్లు బాదేశాడు. ఈ క్రమంలోనే కేవలం 33 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ మార్క్ ను కూడా టచ్ చేశాడు. మొత్తంగా 52 బంతుల్లో 10 బౌండరీల సాయంతో 65 పరుగులు చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కాగా, తమిళనాడు వికెట్కీపర్, ఓపెనర్ అయిన జగదీశన్ 2018 నుంచి 2022 వరకు ధోనీ గైడెన్స్ లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (277) చేసిన రికార్డు ను తన పేరిట రాసుకున్నాడు జగదీశన్. ఇతడిని 2023 ఐపీఎల్ ఆక్షన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు రూ. 90 లక్షలకు దక్కించుకుంది. ఇక 2024, 2025 సీజన్ లో జగదీశన్ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. మొత్తంగా ఐపీఎల్లో 13 మ్యాచ్లు ఆడిన జగదీశన్ 110.20 స్ట్రైక్ రేట్ తో 162 పరుగులు
మాత్రమే చేయగలిగాడు.
ఇక తాజాగా జరిగిన మ్యాచ్ విషయానికొస్తే, మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ 47.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌట్ అయింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు పడగొట్టి రాజస్థాన్ను గట్టిగా అడ్డుకున్నాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్లో ఓపెనర్ అభిజీత్ తోమర్ (125 బంతుల్లో 111 ; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకంతో, సారథి మహిపాల్ లోమ్రార్ (49 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో మెరిశారు.