కోహ్లీ తర్వాత సెంచరీ సాధించిన రెండో భారత క్రికెటర్
తద్వారా ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్లో విరాట్ కోహ్లీ తర్వాత సెంచరీ సాధించిన రెండో భారత క్రికెటర్గా పుజారా నిలిచాడు. ఓవర్నైట్ స్కోరు 19/0తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లు మరోసారి నిరాశపరిచారు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో 13 పరుగుల వ్యవధిలో రాహుల్ (19), ధావన్ (23) ఔటయ్యారు. జట్టు స్కోరు 37/1 ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన పుజారా.. కెప్టెన్ కోహ్లీతో కలిసి ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొనడంతో లంచ్ సమయానికి భారత్ స్కోరు వంద పరుగులకు చేరింది.
100 బంతుల్లో పుజారా హాఫ్ సెంచరీ
విరామం తర్వాత వీరిద్దరు వేగం పెంచి చకచకా పరుగులు సాధించారు. 100 బంతుల్లో పుజారా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి జోడీని ఇంగ్లాండ్ యువ బౌలర్ శామ్ కుర్రన్ విడదీయడంతో భారత్ పతనం ప్రారంభమైంది. కోహ్లీ స్లిప్లో కుక్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కోహ్లీ (46)తో కలిసి మూడో వికెట్కి 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే.. జట్టు 142 వద్ద కోహ్లీ ఔటవగా.. అనంతరం వచ్చిన అజింక్య రహానే(11) వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు.
వికెట్ల ముందు దొరికిపోయిన రహానే
స్టోక్స్ బౌలింగ్లో రహానే వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ రివ్యూలో అది ‘నోబాల్'గా కనిపించింది. దీనిపై పూర్తిగా స్పష్టత లేకున్నా... టీవీ అంపైర్ మాత్రం ఇంగ్లండ్కు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ దశలో మొయిన్ అలీ 14 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లతో టీమిండియాను దెబ్బ తీశాడు. 29 బంతులాడిన రిషభ్ పంత్ (0) డకౌట్గా వెనుదిరగ్గా, పాండ్యా (4) కూడా ఎక్కువ సేపు నిలవలేదు.
బుమ్రా సహకారంతో సెంచరీ
ఆ తర్వాత రివర్స్ స్వీప్ ఆడబోయి అశ్విన్ (1), తర్వాతి బంతికి షమీ (0) క్లీన్ బౌల్డయ్యారు. ఇషాంత్తో తొమ్మిదో వికెట్కు 32, బుమ్రాతో పదో వికెట్కు 46 పరుగుల చొప్పున జత చేశాడు. ఇషాంత్ (14) అండగా నిలవడంతో పుజారా స్కోరును ముందుకు నడిపించాడు. ఇషాంత్ ఔటైన తర్వాత బుమ్రా (6) సహకారంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆరు గంటల పాటు క్రీజులో నిలిచిన పుజారా
దాదాపు ఆరు గంటల పాటు క్రీజ్లో నిలిచిన పుజారా కెరీర్లో 15వ సెంచరీని నమోదు చేశాడు. ఆతర్వాత తొలి ఇన్నింగ్స్లో భారత్ 273 పరుగులకు ఆలౌటై 27 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని అందుకుంది. చివరి రెండు వికెట్లకు భారత్ 78 పరుగులు జోడిస్తే అందులో పుజారా చేసినవే 54 ఉన్నాయి. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ (5/63) ఐదు వికెట్లతో చెలరేగగా, బ్రాడ్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది.