హైదరాబాద్: ధర్మశాల వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 'డ్రింక్స్ బాయ్' అవతారం ఎత్తాడు. రాంచీ టెస్టులో భుజం నొప్పి గాయం కారణంగా చివరి టెస్టుకు కోహ్లీ దూరమయ్యాడు. మ్యాచ్ ఆరంభానికి కొద్ది నిమిషాలు ముందు కోహ్లీ తప్పుకుంటున్నట్లు జట్టు మేనేజ్ మెంట్ ప్రకటించింది.
2011 నవంబర్ నుంచి 54 టెస్టుల తర్వాత కోహ్లీ లేకుండా టీమిండియా ఆడిన తొలి మ్యాచ్ ఇదే కావడం విశేషం. 2011 జూన్లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన కోహ్లీ అనతికాలంలో జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. అనంతరం ధోని నుంచి మూడు ఫార్మెట్లలో కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు.
ధర్మశాల టెస్టుకు కోహ్లీ దూరం కావడంతో కెప్టెన్సీ బాధ్యతలను రహానేకి అప్పగించారు. భారత టెస్టు జట్టు తరపున కెప్టెన్సీ చేపట్టిన 33వ టెస్ట్ ప్లేయర్గా రహానే నిలిచాడు. కెప్టెన్ వేసుకునే బ్లేజర్ దుస్తుల్లో రహానే టాస్ వేసేందుకు స్టేడియంలోకి వచ్చాడు. భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి.
కోహ్లీ స్ధానంలో కుల్దీప్ యాదవ్ను తీసుకున్నారు. ఇక పేసర్ ఇషాంత్ శర్మ స్థానంలో భువనేశ్వర్ కుమార్ చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్కు ఇదే తొలి టెస్టు మ్యాచ్ కాగా, కెప్టెన్గా రహానేకు కూడా తొలి టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఇక టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది.
బోర్డర్-గవాస్కర్ సిరిస్ ట్రోఫీ విజేత ఎవరో తేల్చే మ్యాచ్ కావడంతో కోహ్లీ దూరమైనప్పటికీ అతను ఫీల్డ్లో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో అంపైర్లు బంతిని మార్చారు. ఈ క్రమంలో కోహ్లీ 'డ్రింక్స్ బాయ్'గా మారాడు.
తన సహచర ఆటగాళ్లకు డ్రింక్స్ అందిస్తూ కెప్టెన్ రహానేతో పాటు భారత ఆటగాళ్లకు విలువైన సూచనలు చేస్తున్నాడు. కోహ్లీ ఒక్కసారిగా స్టేడియంలో కనిపించడంతో అభిమానులు పెద్దగా కోహ్లీ కోహ్లీ అంటూ కేకలు పెట్టారు. ఇప్పుడు ట్విట్టర్లోనూ కోహ్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.