సిడ్నీ: ఆస్ట్రేలియా జట్టుపై తన ప్రత్యేక 'అభిమానాన్ని' టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ ఎక్కడా దాచుకోవడం లేదు. ఓ వైపు భారీ స్కోర్లు చేస్తూనే.. మరోవైపు మాటలతోనూ ఢీకొట్టే శైలిని ఏడాది కాలంగా కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రస్తుత ఆస్ట్రేలియాల పర్యటనలో ఆ జట్టు ఆల్రౌండర్ ఫాల్క్నర్, కోహ్లీల మధ్య స్లెడ్జింగ్ రసవత్తరంగా సాగుతోంది.
మెల్బోర్న్ వన్డేలో ఫాల్క్నర్ తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటే.. 'నా జీవితంలో నిన్ను సరిపడా బాదాను. వెళ్లి బౌలింగ్ చెయ్' అని అన్నాడు కోహ్లీ. తాజాగా కాన్బెర్రాలో జరిగిన నాలుగో వన్డేలోనూ ఫాల్కునర్ను ఉడికించాడు కోహ్లీ.
ఇన్నింగ్స్ 22వ ఓవర్లో సింగిల్ కోసం ప్రయత్నించిన కోహ్లీని రనౌట్ చేసే అవకాశం వచ్చింది. మిడాన్లో ఉన్న ఫాల్కునర్ తగిన విధంగా స్పందించలేకపోయాడు. దీంతో అతడ్ని ఉద్దేశించి 'గాఢ నిద్రలో ఉన్నట్లున్నవావ్' అని కోహ్లీ నవ్వుతూ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు కథనాన్ని ఆస్ట్రేలియా పత్రిక 'పెర్త్ నౌ' ప్రచురితం చేసింది.
అయితే కొన్ని ఆస్ట్రేలియా పత్రికలు మాత్రం ఈ ఘటనలో కోహ్లీని దోషిగా చిత్రకరిస్తూ కథనాలు ప్రచురితం చేశారు. కాగా, నాలుగో వన్డేలో ఫాల్కునర్ బౌలింగ్లో 16 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ.. 4 ఫోర్లు, 1 సిక్స్ తో 29 పరుగులు రాబట్టాడు.
ఇటీవల స్లెడ్జింగ్ గురించి ఫేస్బుక్లో స్పందిస్తూ.. 'స్లెడ్జింగ్ చేసే హక్కు ప్రత్యర్థికి తప్పకుండా ఉంటుంది. అయితే అది హద్దు మీరనంతవరకే. సరదాగా ఇరువురి మధ్య మాటలతూటాలు పేలితే బాగానే ఉంటుంది. ఈ మధ్య నేను చాలా సార్లూ స్లెడ్జింగ్కు గురయ్యా. దానికి సమాధానాలు కూడా చక్కగానే ఇచ్చా' అని తెలిపాడు కోహ్లీ.