
హైదరాబాద్: హైదరాబాదీ ఆటగాళ్లు పీవి సింధు, మరికొంతమంది పలు ఈవెంట్లలో దూసుకుపోతోంటే హైదరాబాదీ అయిన ఇందర్జిత్ మాత్రం నిషేదానికి లోనై పోటీల నుంచి దూరమైయ్యాడు. భారత అగ్రశ్రేణి షాట్ పుటర్ ఇందర్జీత్ సింగ్పై నాలుగేళ్ల నిషేధం పడింది. రెండేళ్ల కిందట రియో ఒలింపిక్స్కు ముందు అతను డోప్ టెస్టులో విఫలమైయ్యాడు.
దీనిపై విచారణ జరిపిన జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) క్రమశిక్షణ కమిటీ ఇందర్జీత్పై నాలుగేళ్ల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. రియో ఒలింపిక్స్కు అందరికంటే ముందు అర్హత సాధించిన అథ్లెట్లలో ఇందర్జీత్ ఒకడు. ఐతే ఒలింపిక్స్ ముంగిట నిర్వహించిన డోప్ పరీక్షల్లో యూరిన్ శాంపిల్స్ సేకరించగా.. అతను యాండ్రోస్టెరోన్, ఎటియోకొలనలోన్ అనే నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లుగా తేలింది.
2016 జూన్ 26న అతడిపై ప్రాథమికంగా సస్పెన్షన్ వేటు పడింది. ఇందర్జీత్ కేసును విచారించిన త్రిసభ్య కమిటీ.. అతను డోపింగ్ నిరోధక కోడ్ను ఉల్లంఘించినట్లుగా నిర్ధరించింది. ప్రాథమిక సస్పెన్షన్ పడ్డ తేదీ నుంచే నాలుగేళ్ల నిషేధం అమలవుతుందని కమిటీ ప్రకటించింది. అంటే ఇందర్జీత్ ఇంకో రెండేళ్ల పాటు నిషేధంలో ఉంటాడు.
ఇప్పటికే 30 ఏళ్ల వయసున్న ఇందర్జీత్ మళ్లీ ఆటలోకి రావడం కష్టమని భావిస్తున్నారు. కాగా, అతను ఆడే సమయంలో.. ఏ జాతీయ క్యాంపుల్లో శిక్షణ తీసుకునే వాడు కాదు. కేవలం అతని సొంత కోచ్ సహాయంతో శిక్షణ పూర్తి చేసుకుని పోటీల్లో పాల్గొనేవాడు ఈ హైదరాబాదీ.