
యావరేజ్గానే..
ఈ మ్యాచ్లో చెన్నై ఆటతీరు యావరేజ్. ఓపెనర్లు, టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ.. మిడిల్, లోయర్ ఆర్డర్ నిలదొక్కుకుంది. పోరాడదగ్గ స్కోర్ను ప్రత్యర్థి ముందు ఉంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ చాలాకాలం తరువాత ఫామ్లోకి వచ్చాడు. భారీ ఇన్నింగ్ ఆడాడు. 48 బంతుల్లో అయిదు ఫోర్లు, అయిదు సిక్సర్లతో 73 పరుగులు చేశాడు.

ఆ ముగ్గురూ ఫెయిల్..
మరో ఓపెనర్ రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, శివం దుబే తక్కువ పరుగులకే అవుట్ అయినా.. మిడిలార్డర్లో అంబటి రాయుడు, చివర్లో రవీంద్ర జడేజా ధాటిగా ఆడటంతో ఆ స్కోర్ సాధ్యపడింది. ఈ ముగ్గురిలో ఒక్కరైనా క్రీజ్లో నిలదొక్కుకుని ఉంటే.. మరోసారి జట్టు స్కోర్ బోర్డు 200 మార్క్ను ఖచ్చితంగా దాటి ఉండేది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై పరుగుల వరద పారించిన రాబిన్ ఉతప్ప, శివందుబే తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. మిడిలార్డర్లో అంబటి రాయుడు, ఆ తరువాత రవీంద్ర జడేజా ధాటిగా ఆడటంతో ఆ పరుగులొచ్చాయి.

రాణించిన బౌలర్లు..
రెండు పరుగులకే రెండు వికెట్లతో ప్రారంభంలో చెన్నై బౌలర్లు చెలరేగారు. వారి బౌలింగ్ ధాటికి మాథ్యూవేడ్ స్థానంలో ఓపెనర్గా బరిలోకి దిగిన వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాతియా.. తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. గిల్, విజయ్ శంకర్- కనీసం ఖాతాను సైతం తెరవలేకపోయారు. 48 పరుగులకు నాలుగు వికెట్లు కుప్పకూల్చారు చెన్నై బౌలర్లు. శుభ్మన్ గిల్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు. విజయ్ శంకర్దీ అదే పరిస్థితి.

మ్యాచ్ చెన్నై చేతిలోకి వెళ్లిందనుకున్న దశలో..
వరుసగా వికెట్లను పడగొడుతూ చివరి వరకూ గుజరాత్ బ్యాటర్లను ఒత్తడిలోకి నెట్టిన చెన్నై బౌలర్లు డెత్ ఓవర్లలో చేతులెత్తేశారు. వారి బౌలింగ్ కట్టుతప్పింది. చివరి మూడు ఓవర్లల్లో 48 పరుగులు చేయాల్సిన స్థితిలోకి గుజరాత్ను తీసుకొచ్చినప్పటికీ మ్యాచ్ను చెన్నై కోల్పోయిందంటే బౌలింగ్ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్టార్ పేసర్ క్రిస్ జోర్డాన్ వేసిన 18వ ఓవర్లో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ చేజారిపోయింది. ఆ ఒక్క ఓవర్లో 25 పరుగులను పిండుకోవడంతో రన్రేట్ భారీగా తగ్గించుకోగలిగారు గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు.

ఆ ఇద్దరినీ అవుట్ చేయలేక..
డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్ మ్యాచ్ను గెలిపించారు. 51 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో డేవిడ్ మిల్లర్ 94 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. రషీద్ ఖాన్ 21 బంతుల్లో 40 పరుగులు బాదాడు. ఇందులో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. ఈ ఇద్దరూ చెన్నై చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నారు. 18వ ఓవర్లో రషీద్ ఖాన్ 25 పరుగులను రాబట్టడంతో ఒక్కసారిగా మ్యాచ్ మొత్తం గుజరాత్ టైటాన్స్ వైపు మొగ్గు చూపింది. మిల్లర్ను సకాలంలో అవుట్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.


Click it and Unblock the Notifications
