ఫిజియోని అవమానించారు: మండిపడ్డ కోహ్లీ, ఖండించిన స్మిత్
హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్టు సిరిస్లో ఇరు దేశాల కెప్టెన్లు కోహ్లీ, స్మిత్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. బెంగళూరు టెస్టులో డీఆర్ఎస్తో మొదలైన వైరం ఇంకా రాంచీ వరకు కొనసాగుతూనే వచ్చింది.
రాంచీ టెస్టు తొలిరోజున టీమిండియా కెప్టెన్ కోహ్లీ గాయపడిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా రెండో రోజు ఆటకు కోహ్లీ దూరమయ్యాడు. దీనిపై ఆస్ట్రేలియా ఆటగాళ్లు కోహ్లీని ఎగతాళి చేయడం, కోహ్లీ కూడా కాస్తంత ఘాటుగానే స్పందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ గొడవ మైదానాన్ని దాటి మీడియా సమావేశం వరకూ వెళ్లింది.
తాజాగా టీమిండియా ఫిజియో ప్యాట్రిక్ ఫర్హాత్ను ఆస్ట్రేలియా ఆటగాళ్లు అవమానించారని కెప్టెన్ కోహ్లీ ఆరోపించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. 'ఆస్ట్రేలియా ఆటగాళ్లు నలుగురైదుగురు అదే పనిగా పాట్రిక్ పేరు ఎత్తడం గమనించాను.
అతను మా జట్టు ఫిజియో. గాయపడ్డ ఆటగాళ్లకు వైద్యసేవలు చేస్తాడు. అతన్ని బయటికి లాగడం వెనుక ఉన్నా కారణమేంటో తెలియడం లేదు' అని కోహ్లీ అన్నాడు.

కోహ్లీ గాయంపై మ్యాక్స్వెల్ ఎగతాళి
కోహ్లీ గాయంపై మ్యాక్స్వెల్ ఎగతాళి చేసిన దానికి బదులుగా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అవుటైన సందర్భంలో కోహ్లీ అదే తరహాలో వ్యవహారించాడు. దీనిపై విలేకరుల సమావేశంలో ఒక ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ప్రస్తావించగా ‘మా వాళ్లందరూ క్రికెట్కు సంబంధించిన ప్రశ్నలడుగుతుంటే..మీరు మాత్రం వివాదాస్పద అంశంపై అడుగుతున్నారే. అలాంటివి మైదానంలో సహజం' అని కోహ్లీ చెప్పాడు.

కోహ్లీ చేసిన ఆరోపణల్ని ఖండించిన స్టీవ్ స్మిత్
మరోవైపు ఫిజియోను ఆస్ట్రేలియా ఆటగాళ్లు అవమానించారని కెప్టెన్ కోహ్లీ చేసిన ఆరోపణల్ని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తీవ్రంగా ఖండించాడు. ప్యాట్రిక్ను మేము అవమానించలేదని, తమ దేశానికే చెందిన అతన్ని ఎందుకు అగౌరవపరుస్తామని ఆసీస్ కెప్టెన్ స్మిత్ పేర్కొన్నాడు.

తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు
'ఈ ఆరోపణలు నిరాశ కలిగించాయి. అలాంటిదేమీ జరగలేదు. మేం పాట్రిక్ను అగౌరవపరిచామని కోహ్లీ అంటున్నాడు. కానీ దానికి పూర్తి భిన్నంగా మేం వ్యవహరించామని నేనంటున్నా. పాట్రిక్.. భుజం గాయానికి గురైన కోహ్లీ వేగంగా కోలుకుని మైదానంలోకి తిరిగొచ్చేలా చూశాడు. అతను తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు' అని స్మిత్ అన్నాడు.
క్రీడా స్ఫూర్తిని దెబ్బ తీసిన ఆసీస్ ఆటగాళ్లు
కోహ్లీ భుజానికి అయిన గాయంపై ఎగతాళి చేయడం ద్వారా ఆసీస్ ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తిని దెబ్బ తీశారని వస్తున్న ఆరోపణలపై స్మిత్ స్పందించాడు. ‘భారత్తో మేం టెస్టు మ్యాచ్లు ఆడుతున్నపుడు కొంచెం ఉత్కంఠ ఉంటుంది. పోటీ పోటీగా ఆడతాం. అయితే క్రీడా స్ఫూర్తి విషయంలో ఇబ్బందేమీ లేదు. సరైన స్ఫూర్తితోనే మ్యాచ్ సాగింది' అని అన్నాడు.

పుజారా, సాహా నెలకొల్పిన భాగస్వామ్యం అత్యుత్తమం
పుజారా, సాహా నెలకొల్పిన భాగస్వామ్యం నేను చూసినదాంట్లో అత్యుత్తమైందని కోహ్లీ అన్నాడు. ఆస్ట్రేలియాకు కీలకమైన టాస్ కోల్పోయిన తర్వాత 150 పరుగుల ఆధిక్యం సాధిస్తామని అస్సలు ఊహించలేదని, దీనికి తోడు జడేజా రెండు వికెట్లు తీసి గెలుపుపై ఆశలు రేపాడు. గెలుపు ఖాయమనుకున్న మ్యాచ్ను డ్రాగా మలిచిన ఆసీస్ బ్యాట్స్మెన్ హండ్స్కోంబ్, షాన్మార్ష్ ఆటతీరు అద్భుతని కొనియాడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications