
స్వీయ తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకున్న కోహ్లీసేన
ముఖ్యంగా ఈ సిరిస్లో ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో పేలవమైన ఆటతో.. స్వీయ తప్పిదాలతో.. ఆటగాళ్ల ఎంపికలో గందరగోళంతో సర్వత్రా విమర్శలపాలైంది. చివరికి సఫారీల చేతిలో 0-3తో క్లీన్స్వీప్ అవుతారా? లేక 0-2తో పరువు నిలబెట్టుకుంటారా అన్న పరిస్థితి టీమిండియా తెచ్చుకుంది. ఈ సిరిస్లో చివరిదైన మూడో టెస్టు బుధవారం వాండరర్స్ వేదికగా మధ్యాహ్నాం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. వాండరర్స్లో దక్షిణాఫ్రికాకు పోటీనిచ్చేందుకు కోహ్లీసేన ఇప్పటికే నెట్స్లో తీవ్రంగా చెమటోడుస్తున్నది. మరోవైపు వాండరర్స్లో కూడా విజయం సాధించి కోహ్లీసేనను వైట్ వాష్ చేయాలని సఫారీ జట్టు చూస్తోంది.

మూడో టెస్టులో రహానే, భువీకి అవకాశం
ఇప్పటి వరకు 34 మ్యాచ్లకు కెప్టెన్సీ వహించిన కోహ్లీ జట్టులో కనీసం ఒక్క మార్పైనా చేయకుండా ఒక్క మ్యాచ్ ఆడలేదు. మూడో టెస్ట్కు భారత తుది జట్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తొలి టెస్ట్లో ఆకట్టుకున్న భువీతో పాటు రహానేను ఆడించేందుకు జట్టు మేనేజ్మెంట్ యోచిస్తోంది. ఇందులో భాగంగా రెండు రోజులుగా అతడు నెట్స్లో నాలుగు సెషన్ల పాటు కఠోరంగా శ్రమించాడు. సోమవారం భువి, ఇషాంత్, ఉమేశ్, షమి బౌలింగ్, బ్యాటింగ్ రెండింటినీ సాధన చేశారు. ఇక, తొలి రెండు టెస్టుల్లో విఫలమైన రోహిత్ విషయంలో సందిగ్ధత నెలకొంది. పిచ్ పచ్చికతో కళకళలాడుతున్న నేపథ్యంలో స్పిన్నర్లను ఆడించకుండా రోహిత్ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. సెంచూరియన్లో కీలక క్యాచ్లు విడిచిపెట్టిన సీనియర్ వికెట్కీపర్ పార్థివ్ స్థానాన్ని దినేశ్ కార్తీక్తో భర్తీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆరుగురు బ్యాట్స్మెన్, నలుగురు పేసర్లు, ఒక ఆల్రౌండర్తో కోహ్లీ మూడో టెస్టు బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు సఫారీ గడ్డపై భారత్ వైట్వాష్ అవ్వలేదు
భారత జట్టు 1992 నుంచి 6 సార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించింది. సచిన్ కెప్టెన్సీలో 1996-97లో మూడు టెస్టుల సిరీస్లో 0-2తో ఓటమే ఇప్పటి వరకు అత్యంత చెత్త ప్రదర్శన. ఇక 2006 నుంచి కనీసం ఒక టెస్టు అయినా గెలవడమో లేదంటే డ్రా చేసుకోవడమో జరుగుతూ వస్తోంది. మూడో టెస్టు జరిగే వాండరర్స్లో భారత్ ఇప్పటివరకు ఓడిపోలేదు. 1992 నవంబర్, 1997 జనవరి, 2006 డిసెంబర్, 2013 డిసెంబర్లో ఇక్కడ మ్యాచ్లు ఆడింది. పేసర్ శ్రీనాథ్ 8/99తో వీరోచిత బౌలింగ్తో అదరగొట్టడంతో ద్రవిడ్ కెప్టెన్సీలో 2006లో భారత్ విజయం సాధించింది. 11 ఏళ్ల తర్వాత ఇక్కడ అడుగుపెడుతున్న కోహ్లీసేన మాత్రం కనీసం డ్రానైనా చేస్తుందా లేదా అన్న సందేహాలు వస్తున్నాయి.

స్పిన్నర్ లేకుండా బరిలోకి దక్షిణాఫ్రికా
ఇప్పటికే సిరీస్ను 2-0తో కైవసం చేసుకున్న ఆతిథ్య దక్షిణాఫ్రికా మూడో టెస్టుపై కన్నేసింది. రెండో టెస్టులో గాయపడ్డ మార్క్రమ్ బుధవారానికి ఫిట్ అయ్యే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ఉన్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా తమ రిజర్వు ఆటగాళ్ల బలాన్ని పరీక్షించే అవకాశం కూడా ఉంది. పిచ్ స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణాఫ్రికా స్పిన్నర్ లేకుండానే వాండరర్స్లో మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ఇదే జరిగితే స్పెషలిస్టు స్పిన్నర్ కేశవ్ మహారాజ్కు చోటు దక్కడం కష్టం. తెంబా బువుమా గాయంతో దూరమయ్యాడు. ఒక వేళ మహారాజ్ను మూడో టెస్టు నుంచి తప్పించాల్సి వస్తే, థెన్యూస్ డీ బ్రూయిన్ లేదా అండిల్ ఫెకుల్వాయోను తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. భారత్తో పోలిస్తే దక్షిణాఫ్రికాకు డివిలీయర్స్ ప్రస్తుతం ఆ జట్టు అదనపు బలంగా కనిపిస్తున్నాడు.

జట్ల అంచనా:
భారత్: కోహ్లీ(కెప్టెన్), విజయ్, ధావన్, రాహుల్, పుజారా, రహానే, రోహిత్ శర్మ, హార్దిక్, పార్థివ్, దినేశ్ కార్తీక్, అశ్విన్, భువనేశ్వర్, ఇషాంత్, షమీ, ఉమేశ్, బుమ్రా.
దక్షిణాఫ్రికా: డుప్లెసిస్(కెప్టెన్), ఎల్గర్, మక్రామ్, ఆమ్లా, డివిలీయర్స్, డీకాక్, బ్రుయిన్, ఫెకుల్వాయో, కేశవ్ మహారాజ్, ఫిలాండర్, రబాడ, మోర్నీ మోర్కెల్, లుంగి ఎంగ్డీ.
పిచ్, వాతావరణం:
పిచ్ పచ్చికతో కలకలలాడుతున్నది. పేస్, బౌన్స్కు బాగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ జరుగుతున్న కొద్ది పిచ్పై పగుళ్లు ఏర్పడే చాన్స్ ఉంది. వర్షం పడే అవకాశాలు ఉన్నాయి.
మధ్యాహ్నం 1:30 నుంచి మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.


Click it and Unblock the Notifications