మొహాలి: ఇంగ్లాండ్తో మొహాలి వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో టెస్టు విజయం అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ తన సహచరులు బాగా ఆడారని కోహ్లీ కితాబిచ్చాడు.
మూడో టెస్టులో తామంతా మంచి క్రికెట్ ఆడామని అన్నాడు. ముఖ్యంగా జట్టులోని ప్రధాన పేసర్లు అద్భుతంగా రాణించారని కొనియాడాడు. పిచ్లో టర్న్ సాధ్యం కానప్పుడు బంతిని స్వింగ్ చేస్తూ భారత పేసర్లు వికెట్లను పడగొట్టారని కోహ్లీ తెలిపాడు. ప్రధాన పేసర్ షమీ పుల్ లెంగ్త్ బంతులతో పాటు బంతిని స్వింగ్ చేయడం, సందర్భానికి అనుగుణంగా బౌన్సర్లు సంధించిన తీరు అద్భుతమని అన్నాడు.

ఇంగ్లాండ్ ఆటగాళ్లపై షమీ బౌన్సర్లు సంధించడం తమకు బాగా కలిసొచ్చిందని చెప్పాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత షమీ అద్భుతంగా రాణిస్తున్నాడని కోహ్లీ కితాబిచ్చాడు. భారత జట్టు స్వదేశంలో ఆడుతున్న సమయంలో పిచ్లపై ఫోకస్ ఉంటుందని అన్నాడు. ఆతిథ్య జట్టుకు వ్యతిరేకంగా, భారత జట్టుకు అనుకూలంగా స్పిన్ పిచ్లను తయారు చేస్తారనే అవవాదు కూడా ఉంది.
అయితే ఇంగ్లాండ్తో జరుగుతున్న ఈ సిరిస్ అందుకు పూర్తిగా భిన్నంగా ఉందని కోహ్లీ తెలిపాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో ఆల్ రౌండర్ జడేజా చేసిన 90 పరుగులు జట్టును ఆధిక్యంలో నిలిపాయని కోహ్లీ తెలిపాడు. మొహాలి టెస్టులో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన కరణ్ నాయర్కు మంచి అవకాశాన్ని కల్పించలేకపోయామన్నాడు.
టాస్ ఓడిపోవడంతో ఈ మ్యాచ్ గెలుస్తామని అనుకోలేదని, అయితే డ్రాగా ముగుస్తుందని తాను భావించానని అన్నాడు. అయితే మంచి క్రికెట్ ఆడటంతో పాటు జట్టులో ఆటగాళ్లంతా ఎవరి పాత్రను వారు సమర్ధవంతంగా పోషించడంతో విజయం సాధించామని కోహ్లీ చెప్పాడు.
మూడో టెస్టులో ఇంగ్లాండ్పై 8 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. 103 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 20.2 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేధించింది.
టీమిండియా వికెట్కీపర్ పార్థివ్ పటేల్ అర్ధసెంచరీని నమోదు చేశాడు. 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న పార్ధీవ్ పటేల్ 39 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఓపెనర్ మురళీ విజయ్ డకౌట్గా వెనుదిరిగినా, పుజారా (25), విరాట్కోహ్లీ (6 నాటౌట్)లతో చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.