హైదరాబాద్: ఓవల్ వేదికగా జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ 239 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్లో 2-1 ఆధిక్యం సాధించింది. ఇంగ్లాండ్ స్పిన్నర్ మొయిన్ అలీ హ్యాట్రిక్ (4/45) వికెట్లతో చెలరేగాడు.
492 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి ఓవర్నైట్ స్కోరు 117/4తో చివరి రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 77.1 ఓవర్లలో 252 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాట్స్మన్ ఎల్గర్ (136; 228 బంతుల్లో, 20 ఫోర్లు) సెంచరీ సాధించగా, బవుమా 32 పరుగులు చేశాడు.
అతడు బవుమా (32)తో ఐదో వికెట్కు 108 పరుగులు జోడించాడు. ఎల్గర్.. టెయిలెండర్లతోనూ కలిసి పోరాడాడు. మోరిస్ (24)తో ఏడో వికెట్కు 45, మహారాజ్ (24 నాటౌట్)తో ఎనిమిదో వికెట్కు 47 పరుగులు జోడించాడు. దీంతో దక్షిణాఫ్రికా ఓటమి ఖాయమైంది.

అయితే అలీ విజృంభణతో ఆ జట్టు ఇన్నింగ్స్ త్వరగానే ముగిసింది. 252/7 పరుగులతో ఉన్న దక్షిణాఫ్రికా అలీ హ్యాట్రిక్ కారణంగా ఇంకో పరుగు కూడా జోడించకుండానే ఇన్నింగ్స్ ముగించింది. ఇన్నింగ్స్ 76వ ఓవర్ చివరి రెండు బంతులకు ఎల్గర్, రబడా (0)లను అవుట్ చేసిన మొయిన్ అలీ ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికి మోర్నీ మోర్కెల్ (0)ను అవుట్ చేసి, ఇన్నింగ్స్కు తెరదించాడు.
వంద టెస్టుల ఓవల్ గ్రౌండ్లో ఇదే తొలి హ్యాట్రిక్ కాగా... 79 ఏళ్ల తర్వాత హ్యాట్రిక్ సాధించిన తొలి ఇంగ్లాండ్ స్పిన్నర్గా అలీ నిలిచాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో రొలాండ్ జోన్స్ 3, బెన్ స్టోక్స్ 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 353 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 175 పరుగులకే ఆలౌటైంది.
ఇంగ్లాండ్ 313/8 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. స్టోక్స్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. నాలుగు టెస్టుల సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్టు ఆగస్టు 4 నుంచి మాంచెస్టర్లో ప్రారంభం కానుంది.