హైదరాబాద్: బ్రిస్టల్ వేదికగా వెస్టిండిస్తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 53 బంతుల్లోనే సెంచరీ సాధించిన అలీ, ఇంగ్లాండ్ తరఫున రెండో వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. మొయిన్ అలీ 57 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సుల సాయంతో 102 పరుగులతో చెలరేగడంతో వెస్టిండీస్తో మూడో వన్డేలో ఇంగ్లండ్ 124 పరుగులతో ఘన విజయం సాధించింది.
టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన అలీ కేవలం 53 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఓ దశలో మెుయిన్ అలీ 14 బంతుల వ్యవధిలో (6 6 2 4 6 6 6 6 2 4 1 6 0 6) ఇలా ఎనిమిది సిక్స్లు బాదాడు. అలీ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నుంచి సెంచరీకి చేరుకోవడం విశేషం.

అలీతో పాటు కెప్టెన్ రూట్ (84), బెన్ స్టోక్స్ (73) హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 369 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్లో మొయిన్ అలీ ఇన్నింగ్స్ హైలెట్గా నిలిచింది. తొలి 39 బంతుల్లో 39 పరుగులు చేసిన అలీ ఆ తర్వాత 14 బంతుల్లో 61 పరుగులు సాధించాడు.
అనంతరం 370 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ 39.1 ఓవర్లలో 245 పరుగులకే ఆలౌటైంది. క్రిస్ గేల్ (78 బంతుల్లో 94; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగినప్పటికీ.. మిగతా బ్యాట్స్మెన్ విఫలం కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.
ఇంగ్లాండ్ బౌలర్లలో ప్లంకెట్కు 5 వికెట్లు తీయగా, రషీద్ మూడు వికెట్లు తీసుకున్నాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ 2-0 ఆధిక్యం సంపాదించింది.