మొహాలి: భారత పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ ఆటగాళ్లు అరుదైన భాగస్వామ్యాలను నమోదు చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన రెండో వన్డేలో టిమ్ సౌథీ 10వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అర్ధ సెంచరీ సాధించడం ద్వారా ఒక రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
న్యూజిలాండ్ వన్డే క్రికెట్లో 10 లేదా 11వ స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చి అర్ధ సెంచరీ సాధించిన ఆ దేశ తొలి ఆటగాడిగా టిమ్ సౌథీ చరిత్ర సృష్టించాడు. అయితే తాజాగా మొహాలిలో ఆదివారం జరిగిన మూడో వన్డేలో జేమ్స్ నీషమ్-హెన్రీల జోడి సరికొత్త భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.
మూడో వన్డేలో తొమ్మిది వికెట్కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. దీంతో తొమ్మిదో వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన న్యూజిలాండ్ జోడిగా అవతరించింది. ఈ భాగస్వామ్యంతో 2009లో భారత్పై 9వ వికెట్కు కివీస్ జోడి మిల్స్-సౌథీలు నమోదు చేసిన 83 పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించారు.

కాగా, మూడో వన్డేలో మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టంగా భారత బౌలర్లు బౌలింగ్ చేసి, కివీస్ మిడిలార్డర్ను భాగస్వామ్యం లేకుండా చేశారు. అయితే చివర్లో టెయిలెండర్లను ఔట్ చేయడానికి బౌలర్లు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా చివరి పది ఓవర్లలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు.
దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 49.4 ఓవర్లలో 285 పరుగులకే ఆలౌట్ అయింది. 286 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ధోని సేన 48.2 ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయి 289 పరుగులు చేసింది. దీంతో కివీస్పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
లక్ష్య చేధనలో భాగంగా ధోనీ, కోహ్లీలు చక్కటి భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో ధోనీ 80 పరుగుల వద్ద ఔటవ్వగా, కోహ్లీ 154 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్లో భారత్ 2-1 తేడాతో ముందజంలో ఉంది. నాలుగో వన్డే ఈనెల 26న రాంచీలో జరగనుంది.