
ఆధిపత్యానికి అక్కడే బీజం..
భారత్ ఇప్పుడు అనుభవిస్తోన్న ఈ పేరు ప్రఖ్యాతులకు ప్రధాన కారణం- 1983 ప్రపంచకప్ టోర్నమెంట్. ఇప్పటి వైభవానికి అక్కడే బీజాలు పడ్డాయి. కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు 1983 ప్రపంచకప్ను గెలుచుకున్న తరువాత టీమిండియా ఆధిపత్యం మొదలైంది. మధ్యలో కొన్ని ఎత్తు పల్లాలు చవి చూసినప్పటికీ- తన ప్రాభవాన్ని మాత్రం కోల్పోలేదు. టీ20 ప్రపంచకప్ను గెలవడంతో అది మరో మలుపు తిరిగింది. 2011లో రెండోసారి ప్రపంచకప్ను గెలవడంతో క్రికెట్లో భారత్ అత్యున్నత స్థాయికి చేరినట్టయింది.

అండర్ డాగ్గా..
1983లో సరిగ్గా ఇదే రోజు కపిల్ డెవిల్స్ ప్రపంచకప్ను గెలుచుకుంది. అండర్ డాగ్గా టోర్నమెంట్లో ఎంట్రీ ఇచ్చిన టీమిండియా.. ఛాంపియన్గా ఆవిర్భవించిన క్రమం.. ఓ అద్భుతం. ఫైనల్లో వెస్టిండీస్ను ఓడించింది. జూన్ 25వ తేదీన ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానంలో వెస్టిండీస్ను ఏకంగా 43 పరుగుల తేడా మట్టి కరిపించింది. ఆల్రౌండర్ మొహిందర్ అమర్నాథ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నారు.
183 పరుగులకే ఆలౌట్ అయినా..
ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 54.4 ఓవర్లల్లో 183 పరుగులకు ఆలౌట్ అయింది. వన్డే ఇంటర్నేషనల్స్లో అప్పట్లో 60 ఓవర్లు ఉండేవి. ఓపెనర్లు సునీల్ గవాస్కర్-2, కృష్ణమాచారి శ్రీకాంత్-38, మొహిందర్ అమర్నాథ్-26, యశ్పాల్ శర్మ-11, సందీప్ పాటిల్-27, కేప్టెన్ కపిల్ దేవ్-15, కీర్తి ఆజాద్-0, రోజర్ బిన్ని-2, వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి-14 పరుగులు చేశారు. బల్విందర్ సంధు 11 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఆండీ రాబర్ట్స్-3 వికెట్లు తీసుకున్నాడు. మాల్కమ్ మార్షల్, మైకెల్ హోల్డింగ్, ల్యారీ గోమ్స్ రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు.

ఆ క్యాచ్ ఓ అద్భుతం..
అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్ 140 పరుగులకే కుప్పకూలింది. వివియన్ రిచర్డ్స్ టాప్ స్కోరర్గా నిలిచాడు. 33 పరుగులు చేశాడు. గార్డెన్ గ్రీనిడ్జ్-1, డెస్మండ్ హేన్స్-13, వివియన్ రిచర్డ్స్-33, కేప్టెన్ క్లైవ్ లాయిడ్-8, లారీ గోమ్స్-5, ఫావుద్ బచ్ఛూస్-8, జెఫ్ డూజాన్-25, మాల్కమ్ మార్షల్-18, ఆండీ రాబర్ట్స్-4, మైఖెల్ హోల్డింగ్-6 పరుగులు చేశారు. జోయెల్ గార్నర్ 5 పరుగులతో నాటౌట్గా నిలిచారు. మదన్ లాల్ బౌలింగ్లో వివియన్ రిచర్డ్స్ కొట్టిన బంతిని అందుకోవడానికి కపిల్ దేవ్ క్యాచ్ పట్టడం.. ఇప్పటికీ ఓ చరిత్రే.

ఆధునిక క్రికెట్కు..
ఈ విజయం తరువాత ఇక టీమిండియా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దీని తరువాత భారత్లో క్రికెట్ వైభవం ఉచ్ఛస్థితికి చేరింది. ఆధునిక క్రికెట్ పరుగులు పెట్టింది భారత గడ్డపై. 2011లో మరోసారి ప్రపంచకప్ను సొంతం చేసుకోవడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు.. ఫైనల్స్లో శ్రీలంకను ఓడించి టైటిల్ను సాధించింది.


Click it and Unblock the Notifications












