
హైదరాబాద్: బుధవారం(మే 30)కి ఓ ప్రత్యేకత ఉంది. సరిగ్గా 365 రోజుల తర్వాత ఇదే రోజున ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఆరంభం కానుంది. 2019లో జరిగే వన్డే వరల్డ్ కప్కు ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా మే 30, 2019న ఆతిథ్య ఇంగ్లాండ్ ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
రౌండ్ రాబిన్ విధానంలో జరిగే 2019 వన్డే వరల్డ్ కప్లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్ అంటే 1992 వరల్డ్కప్లో మాదిరిగా ఒక టీమ్ మిగతా అన్ని టీమ్స్తో ఆడాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్లోని మొత్తం పది నగరాల్లోని 11 వేదికలపై మ్యాచ్లను నిర్వహకులు నిర్వహించనున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.
ఇందులో భాగంగా 2019 వన్డే వరల్డ్ కప్కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. దీంతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కొందరు క్రికెట్ అభిమానులతో లండన్లోని ఐకానిక్ బ్రిక్ లేన్లో లాంచింగ్ ఈవెంట్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్తో పాటు ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న క్లైవ్ లాయిడ్, వకార్ యూనిస్, అలెన్ డొనాల్డ్ తదితర క్రికెటర్లు పాల్గొన్నారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఐసీసీ తన అధికారిక ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. 2019 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి జులై 14 వరకు జరగనుంది. టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది.
గతంలో వరల్డ్ కప్ లాంటి పెద్ద ఈవెంట్లను భారత్-పాకిస్థాన్ మ్యాచ్తో ఐసీసీ ప్రారంభించేది. అంతకముందు జరిగిన 2015 వరల్డ్కప్(అడిలైడ్), 2017 చాంపియన్స్ ట్రోఫీ(బర్మింగ్ హామ్) ఇలాగే ప్రారంభమైంది. కానీ, ఈసారి మాత్రం అలా జరగడం లేదు. జూన్ 16న టీమిండియాతో పాకిస్థాన్ మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో తలపడనుంది.
ఇదే వేదికపై ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్తోపాటు తొలి సెమీఫైనల్ కూడా జరగనుంది. మరో సెమీఫైనల్ జూలై 14న ఎడ్జ్బాస్టన్లో జరగనుంది. అంతేకాదు ఈ వరల్డ్కప్ మ్యాచ్లను 1992లో వరల్డ్ కప్లాగా రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్లో ప్రపంచకప్ను అధికారికంగా ప్రసారం చేసేందుకు రేడియో ప్రసార హక్కులను బీబీసీ సొంతం చేసుకుంది.