
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాజాగా నిర్వహించిన కరోనా వైరస్ (కొవిడ్-19) పరీక్షల్లో మరో ముగ్గురు పాక్ క్రికెటర్లకు నెగిటివ్ అని తేలింది. క్రికెటర్లు హైదర్ అలీ, ఇమ్రాన్ ఖాన్, కషిఫ్ బట్టిలతో పాటు పాక్ జట్టు మసాజర్ మలాంగ్ అలీకి కూడా నెగిటివ్ ఫలితాలొచ్చినట్లు పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఈ నలుగురు బుధవారం (జులై 8) ఇంగ్లండ్కు వెళ్లి పాక్ జట్టుతో కలవనున్నారు.
గత నెలలో ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపికైన 29 మంది పాక్ క్రికెటర్లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కరోనా వైరస్ టెస్టులు నిర్వహించగా.. 10 మందికి వైరస్ సోకినట్టు వెల్లడైంది. అనంతరం నిర్వహిచిన టెస్టుల్లో 7 మంది క్రికెటర్లకు నెగిటివ్ రాగా.. ఇటీవల ఇంగ్లండ్కు పయనం అయ్యారు. ఇక తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ముగ్గురు పాకిస్థాన్ క్రికెటర్లు హైదర్ అలీ, ఇమ్రాన్ ఖాన్, కషిఫ్ బట్టి ఇంగ్లండ్కు వెళ్లనున్నారు. అయితే ఫాస్ట్బౌలర్ హారిస్ రవూఫ్ మాత్రం ఇంకా కరోనా నుంచి కోలుకోలేదు. ఇంగ్లండ్తో మూడు టెస్టులు ఆడనున్న పాకిస్తాన్.. ప్రస్తుతం వర్సెస్టర్లో సాధన చేస్తోంది.
మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఆగస్టు 5న మొదలయ్యే తొలి మ్యాచ్తో ఇంగ్లండ్లో పాకిస్థాన్ పర్యటన ఆరంభమవుతుందని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. మొదటి టెస్టు మాంచెస్టర్లో జరుగుతుంది. రెండో టెస్టు (ఆగస్టు 13-17), మూడో టెస్టు (ఆగస్టు 21-25)కు సౌథాంప్టన్ వేదికగా జరగనున్నాయి. ఆ తర్వాత రెండు జట్లు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడతాయి. తొలి మ్యాచ్ ఆగస్టు 28న జరుగుతుంది. టీ20లు అన్నీ సౌథాంప్టన్లో జరుగుతాయి.
పాకిస్థాన్ సీనియర్ ఆల్రౌండర్ మహమ్మద్ హఫీజ్తో కరోనా వైరస్ మహమ్మారి ఆటాడుకున్న విషయం తెలిసిందే. ముందు కరోనా పాజిటివ్ అని తేలగా.. తర్వాత నెగెటివ్ వచ్చింది. మళ్లీ పాజిటివ్ అని నిర్ధారణ కాగా.. ఆ తర్వాత నెగెటివ్ అని తేలింది. చివరకు హఫీజ్ ఇంగ్లండ్ వెళ్ళిపోయాడు. బోర్డు వైద్య సిబ్బంది పాజిటివ్గా నిర్ధరించినా హఫీజ్ దాన్ని అనుసరించి క్వారంటైన్కు వెళ్లకపోవడం పట్ల పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.