ముంబై: ఇంగ్లండ్ లెవెన్తో జరుగుతున్న రెండో వార్మప్ మ్యాచ్లో భారత్ ఏ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ లెవెన్ 48.5 ఓవర్లలో 282 పరుగులకు ఆలౌట్ అయింది.
లక్ష్య ఛేదనకు బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఏ 39.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
కెప్టెన్ రహానే, జాక్సన్, రిషబ్ పంత్, రైనా రాణించారు. ఒకరిద్దరు మినహా కొత్త వాళ్లతో బరిలోకి దిగిన భారత్ ఏ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అలవోక విజయం సాధించింది. మొదటి వార్మప్ మ్యాచ్లో ధోని కెప్టెన్సీలోని భారత్ ఏ ఓడిపోయిన విషయం తెలిసిందే.
అంతకుముందు..
ముంబైలోని బ్రాబౌర్న్ స్డేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వార్మప్ మ్యాచ్లో 9 వికెట్లను కోల్పోయి 48.4 ఓవర్లలో ఇంగ్లాండ్ 282 పరుగులు చేసింది. దీంతో భారత్కు 282 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
42 పరుగుల వద్ద ఓపెనర్ జాసన్ రాయ్ హిట్ వికెట్ రూపంలో పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత హేల్స్ నిలకడగా ఆడుతూ 53 బంతుల్లో 8 ఫోర్లతో అర్ధసెంచరీని నమోదు చేశాడు. అయితే జట్టు స్కోరు 116 వద్ద హెల్స్, ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ పెవిలియన్కు చేరారు.

ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెయిర్ స్టో, స్టోక్స్ మరో వికెడ్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఈ క్రమంలో భారత బౌలర్ అశోక్ దిండా మ్యాజిక్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు మూడు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోయింది.
ఇన్నింగ్స్ 27వ ఓవర్ వేసిన దిండా చివరి బంతికి బెయిర్ స్టోను పెవిలియన్కు చేర్చాడు. 65 బంతులను ఎదుర్కొన్న బెయిర్ స్టో 10 ఫోర్లతో 64 పరుగులు చేశాడు. ఆ మరుసటి ఓవర్లో బట్లర్ పరుగులేవీ చేయకుండానే రసూల్ బౌలింగ్లో అతడికే క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుదిరిగాడు.
మరోసారి దిండా మ్యాజిక్ చేశాడు. 29వ ఓవర్ తొలి బంతికి మోయిన్ అలీని పెవిలియన్కు చేర్చాడు. జట్టు స్కోరు 163 వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ 164 వద్ద ఐదో వికెట్, 165 పరుగుల వద్ద ఆరో వికెట్ను వెంట వెంటనే కోల్పోయింది. దీంతో 30 ముగిసేసరికి ఇంగ్లాండ్ ఆరు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది.
ఆ తర్వాత ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు చేజార్చుకోవడంతో 48.4 ఓవర్లకు గాను 9 వికెట్లను కోల్పోయి 282 పరుగులు చేసింది. కెప్టెన్ రహానే బాలింగ్ను సమర్ధవంతంగా వినియోగించుుకున్నారు. బౌలింగ్ విభాగంలో భారత్ సమష్టిగా రాణించింది.
భారత బౌలర్లలో పర్వేజ్ రసూల్ మూడు వికెట్లు తీసుకోగా, ప్రదీప్ సంగ్వాన్, అశోక్దిండా, షాబాజ్ నదీమ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. సిద్ధార్థ్ కౌల్ ఒక వికెట్ తీసుకున్నాడు.ఈ మ్యాచ్కు అజింక్యె రహానే కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత రహానే ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే కావడం విశేషం.
ఈ వార్మప్ మ్యాచ్తో సురేశ్ రైనా కూడా చాలాకాలం తర్వాత మళ్లీ బ్యాట్ పడుతున్నాడు. వీరిద్దరితో పోలిస్తే ఢిల్లీ వికెట్ కీపర్ రిషబ్ పంత్పైనే ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. ధోని వారసుడిగా వార్తల్లో నిలుస్తున్న రిషబ్ పంత్ ఈ మధ్య కాలంలో దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించాడు.
అటు బ్యాటింగ్లోనూ, ఇటు కీపింగ్లోనూ అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఈ రంజీ సీజన్లో మహారాష్ట్రపై ట్రిపుల్ సెంచరీ కొట్టడంతో అనూహ్యంగా అతనికి టీ20 జట్టులో చోటు కల్పించారు. అయితే ఈ స్థానాన్ని అతనెంత మేరకు సుస్థిరం చేసుకుంటాడో వేచి చూడాలి.
జట్ల వివరాలు:
భారత్ ఎ: రహానే (కెప్టెన్), పంత్, రైనా, హుడా, కిషన్, జాక్సన్, శంకర్, నదీమ్, రసూల్, వినయ్, సాంగ్వాన్, దిండా.
ఇంగ్లండ్ ఎలెవన్: మోర్గాన్ (కెప్టెన్), అలీ, బెయిర్స్టో, బాల్, బిల్లింగ్స్, బట్లర్, డావ్సన్, హేల్స్, ఫ్లంకెట్, రషీద్, రాయ్, స్టోక్స్, విల్లే, వోక్స్.