కింగస్టన్: వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం ఖాయమే అనుకున్నప్పటికీ.. వరుణుడు ఆ ఆశలపై నీళ్లు చల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగోరోజే ఇన్నింగ్స్ విజయం వైపు దూసుకెళ్తున్న భారత్ విజయం వర్షం కారణంగా వాయిదా పడింది. దీంతో మ్యాచ్ ఫలితం ఐదో రోజుకు మారింది.
అయితే, ఆఖరి రోజైన ఐదో రోజు వర్షం పడకుండా ఉండి, భారత బౌలర్లు విజృంభిస్తే రెండో టెస్ట్లో భారత్ విజయం నల్లేరుపై నడకే అవుతుంది. లేదంటే డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. కాగా, మంగళవారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన విండీస్ 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
మూడో రోజు 500/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్.. ప్రత్యర్థి ముందు 304 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా మూడో రోజు ఒక్క బంతి కూడా ఆడని విండీస్ నాలుగో రోజు ఆటని ప్రారంభించింది. నాలుగో రోజు కూడా వాతావరణం అనుకూలంగా లేని కారణంగా మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది.
లంచ్ విరామానికి 15.5 ఓవర్లు మాత్రమే ఆడిన విండీస్ 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. షమి (25/2), ఇషాంత్ (19/1), మిశ్రా (4/1) రాణించడంతో విండీస్ తక్కువ స్కోరుకే కీలక వికెట్లు కోల్పోయింది.

గెలుపును నిర్ణయించనున్న వర్షం, భారత బౌలర్లు
వరణుడి కారణంగా నాలుగోరోజు 15.5 ఓవర్లు మాత్రమే మ్యాచ్ జరిగింది. మంగళవారం ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో గంట ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్.. లంచ్ వరకు మాత్రమే కొనసాగింది. తర్వాత కూడా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు. దీంతో ఐదోరోజు ఆట కీలకంగా మారింది.
ఐదోరోజు కూడా వర్షం అడ్డంకిగా మారితే మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది. ఐదోరోజు షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అన్నీ అనుకూలించి, బౌలర్లు మరోసారి రాణించినట్లయితే భారత్ ఖాతాలో మరో విజయం చేరనుంది.