కింగ్స్టన్: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన అద్భుత ఫాంను కొనసాగిస్తున్నాడు. వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో మరో ఐదు వికెట్లు పడగొట్టి దిగ్గజ బౌలర్లు భగవత్ చంద్రశేఖర్, అనిల్ కుంబ్లేల రికార్డులను సమం చేశాడు.
34వ టెస్ట్ మ్యాచ్లాడిన అశ్విన్ 18వ సారి ఐదు వికెట్లను పడగొట్టి ఈ ఘనతను సాధించిన మూడో భారత బౌలర్గా రికార్డు సృష్టించాడు. దీంతో అంతకుముందు వరుస ఇన్నింగ్స్ల్లో ఐదు వికెట్లు తీసిన భగవత్ చంద్రశేఖర్, అనిల్ కుంబ్లేల సరసన చేరాడు.

విండీస్ తో జరిగిన రెండో టెస్టులో 16ఓవర్లు వేసిన అశ్విన్ 52 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. దీంతో 18వసారి ఐదు వికెట్లు తీసిన బౌలర్గా తన పేరు నమోదు చేసుకున్నాడు. అశ్విన్ అద్భుత ప్రదర్శనతో రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 52.3ఓవర్లలో 196 పరుగులు చేసిన విండీస్ ఆలౌట్ అయింది. పేసర్లకు అనుకూలమైన జమైకాలో ఒక స్పిన్నర్ సాధించిన అత్యున్నత ప్రదర్శన ఇదే కావడం విశేషం.
ఏ మ్యాచ్లోనైనా ప్రత్యర్థి బ్యాట్స్మన్కు బౌలింగ్ వేసే ముందు అతడి ఆటను అంచానా వేస్తానని, ఆ తర్వాత అతడి వికెట్ ఎలా తీయాలనేదానిపై దృష్టి సారిస్తానని అశ్విన్ తొలిరోజు మ్యాచ్ అనంతరం తెలిపాడు. వారి బలాలు, బలహీనతలను తెలుసుకుని బంతి వేస్తే.. తొందరగా ఔటైపోతారని చెప్పాడు. కొన్నిసార్లు అంచనా తప్పవచ్చని, అయితే, గత రెండు ఇన్నింగ్స్ ల్లో కూడా తాను అనుకున్నట్లు జరిగిందని చెప్పుకొచ్చాడు.