
సిడ్నీ: ఆతిథ్య ఆస్ట్రేలియాతో తొలి టెస్టు సన్నాహకంగా జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా బ్యాట్స్మెన్ సత్తాచాటారు. ఆస్ట్రేలియా-ఎ జట్టుతో ఫ్లడ్లైట్ల వెలుతురులో గులాబీ బంతితో జరుగుతున్న వామప్ మ్యాచ్లో భారత్ భారీ ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్ పృథ్వీ షా (3) మినహా మిగతా బ్యాట్స్మెన్ అద్భుతంగా ఆడారు. ఏకంగా నలుగురు బ్యాట్స్మెన్ 50కి పైగా స్కోరు సాధించారు. మిడిలార్డర్లో హనుమ విహారి (104 నాటౌట్), యువ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ (103 నాటౌట్) శతకాలతో చెలరేగారు.
రిషబ్ పంత్ టీ20 తరహాలో రెచ్చిపోయి 73 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం పంత్ మరింత రెచ్చిపోయాడు. విల్డర్మత్ వేసిన ఇన్నింగ్స్ 90వ ఓవర్లో పంత్ ఒక్కడే నాలుగు ఫోర్లు, సిక్సర్ బాది 22 రన్స్ రాబట్టాడు. ఇక ఫస్ట్క్లాస్ క్రికెట్లో హనుమ విహారికిది 21వ శతకం బాదాడు. మయాంక్ అగర్వాల్ (61), శుభ్మన్ గిల్ (65), కెప్టెన్ అజింక్య రహానె (38) గులాబీ బంతిని సమర్థంగా ఎదుర్కొన్నారు.
ఆస్ట్రేలియా-ఏ బౌలర్లలో మార్క్ స్టీకెటీ రెండు వికెట్లు తీయగా.. విల్డర్మత్, స్వెప్సన్ చెరో వికెట్ పడగొట్టారు. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లకు 386 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని భారత్ 472 పరుగుల లీడ్లో ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 194 రన్స్ చేసి ఆలౌటైన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ఏ జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 108 రన్స్ చేసింది.
రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్గా బరిలోకి దిగిన పృథ్వీ షా రెండో ఓవర్లోనే పేలవరీతిలో వికెట్ చేజార్చుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు జట్టులో ఓపెనింగ్ స్థానం కోసం ఇప్పుడు శుభమన్ గిల్, పృథ్వీ షా పోటీపడుతున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా పృథ్వీ షా పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నాడు. డిసెంబరు 17 నుంచి ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. రెండు ప్రాక్టీస్ మ్యాచ్ల్లోనూ షా కనీసం హాఫ్ సెంచరీ మార్క్ని కూడా అందుకోలేకపోయాడు. దాంతో మయాంక్ అగర్వాల్కి జోడీగా తొలి రెండు టెస్టుల్లో ఓపెనర్ శుభమన్ గిల్ ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రెండు టెస్టులకి రోహిత్ శర్మ జట్టులోకి రానున్నాడు.