
హైదరాబాద్: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో అంఫైర్ల తీరుపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా స్కోరు 19 ఓవర్లు ముగిసేసరికి 117/1గా ఉంది. మరో 2 పరుగులు చేస్తే భారత్ విజయం సాధిస్తుంది.
అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు పెవిలియన్కు వెళ్లి విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ క్రమంలో ధావన్ బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమవుతుండగా అంపైర్లు ఒక్కసారిగా 'లంచ్' అని ప్రకటించేశారు. దాంతో ఇరు జట్ల కెప్టెన్లు కోహ్లీ, మార్క్రమ్ ఆశ్చర్యానికి లోనయ్యారు. వారిద్దరు అంపైర్లతో ఏదో చెప్పబోయిన సమయంలో రూల్స్ అంటే రూల్స్ అంటూ వారు తిరస్కరించారు.
దీంతో చేసేదేమీ లేక ఆటగాళ్లు మైదానం వీడారు. అంఫైర్ల నిర్ణయంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రిఫరీ తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోకుండా రాతియుగం లాంటి నిబంధనలు అమలు చేయడం ఏమిటని మాజీ క్రికెటర్లు, వ్యాఖ్యాతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
15 ఓవర్లు ముగిశాక మరో 26 పరుగులు చేయాల్సిన సమయంలోనే లంచ్ సమయం అయింది. నిజానికి ఈ సమయంలోనే బ్రేక్ ఇస్తే ఇంతగా విమర్శలు వచ్చేవి కావు. అయితే అంపైర్లు ఫలితాన్ని ఆశిస్తూ మరో 15 నిమిషాలు పొడిగించారు. ఆపై 4 ఓవర్లలో భారత్ 24 పరుగులు చేసింది.
ఈ క్రమంలో అంఫైర్లు ఆటను నిలిపివేశారు. 45 నిమిషాల విరామం తర్వాత వచ్చీ రాగానే భారత్ గెలవలేదు. షమ్సీ వేసిన 20వ ఓవర్లో ధావన్ పరుగులేమీ చేయకపోవడంతో అది 'మెయిడిన్' ఓవర్ అయింది. ఆ తర్వాత తాహిర్ ఓవర్ మూడో బంతికి కోహ్లీ రెండు పరుగులు తీసి లాంఛనం పూర్తి చేశాడు.
ఇదిలా ఉంటే అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించడంతో రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఓటమి ఖాయం కావడంతో ఆ రెండు పరుగుల కోసం వేచి చూడకుండా ప్రేక్షకులు మైదానం వీడటం కనిపించింది. అంఫైర్ల నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.