ఇండోర్: విమర్శించే వారి నోళ్లు మూయించేలా భారత వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బుధవారం మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు. తనను బెస్ట్ ఫినిషర్ అని ఎందుకు అంటారో అర్థమయ్యేలా చేశాడు. బ్యాట్స్మెన్ అందరూ విఫలమైన చోట.. ధోనీ భారత్ పరువు నిలబెట్టాడు. భారత్ను గెలిపించాడు. దక్షిణాఫ్రికాపై రెండో వన్డేలో ధోనీ బ్యాటింగ్, కెప్టెన్సీ తెగువతో 22 పరుగుల తేడాతో భారత్కు విజయాన్ని చేకూర్చి పెట్టాడు.
ట్వంటీ 20 సిరీస్ ఓటమి, తొలి వన్డేలో పరాజయం నేపథ్యంలో ధోనీ పైన పలువురు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే, మరో నాలుగైదేళ్ల పాటు ధోనీలో ఆడే సత్తా ఉందని చాలామంది మద్దతు పలుకుతున్నారు.
కానీ, ఇటీవల పేలవ ఫాం దానికి తోడు వరుస ఓటములు ధోనీని చిక్కుల్లో నెట్టాయి. దీంతో విమర్శలు వచ్చాయి. రెండో వన్డేలో మాత్రం ధోనీ అద్భుతంగా ఆడాడు. ఓ సమయంలో భారత్ కనీసం 150 లేదా 170 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానాలు కలిగాయి.
కానీ, ధోనీ అద్భుతంగా పోరాడాడు. తద్వారా భారత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ధోనీ ఒంటరి పోరాటం వల్ల టీమిండియా తొమ్మిది వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. తొలి వన్డేలో రాణించిన రోహిత్ శర్మ రెండో వన్డేలో విఫలమయ్యాడు. రహానే రాణించాడు. రహానే 63 బంతుల్లో 51 పరుగులు చేశాడు.
మిగతా వారు ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. ధోనీ మాత్రం 86 బంతులు ఆడి 92 పరుగులు చేశాడు. అందులో నాలుగు సిక్స్లు, ఏడు ఫోర్లు ఉన్నాయి. చివరి ఓవర్లో (50వ ఓవర్) ధోనీ మరిన్ని పరుగులు చేస్తే సెంచరీ చేసేవాడేనేమో.
కానీ, దక్షిణాఫ్రికా కొత్త బౌలర్ రబడ.. ధోనీని ఇబ్బంది పెట్టాడు. చివరి ఓవర్లో మొదటి ఐదు బంతుల్లో పరుగులేమీ చేయని ధోనీ, ఆరో బంతికి మాత్రం సిక్స్ కొట్టాడు. రబడ బౌలింగులో ధోనీ ఇబ్బంది పడుతున్నాడు. అయితే, ధోనీ కెప్టెన్ ఇన్నింగ్స్ అందర్నీ ముగ్ధులను చేసింది.
రహానే మినహా, ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విఫలమైనప్పటికీ... ధోనీ టెయిలెండర్లతో కలిసి, ముఖ్యంగా హర్భజన్ సింగ్తో కలిసి గౌరవమైన పరుగులు అందించాడు. 25, 30 ఓవర్లకే కీలకమైన వికెట్లు అన్నీ పోయాయి. అప్పటికి పరుగులు 120కి అటు ఇటు ఉన్నాయి.

ఈ సమయంలో... బౌలర్లు మినహా, ధోనీ ఒక్కడే ఉన్నాయి. వారితో కలిసి ధోనీ ఏ మేరకు పరుగులు రాబడతాడు? ఇటీవల వరుసగా విఫలమవుతున్నాడు, కాబట్టి కష్టమే... భారత్ 150 లేదా 170 పరుగులు చేయడం కూడా కష్టమే అని భావించారు.
అదే ధోనీ మరోసారి బెస్ట్ ఫినిషర్ అనిపించుకునేలా 92 పరుగులతో అజేయంగా నిలిచి దక్షిణాఫ్రికా ముందు 248 పరుగుల లక్ష్యం ఉంచేలా చేశాడు. మరోవైపు, వరుస ఓటములకు కేవలం ధోనీని మాత్రమే నిందించడాన్ని చాలామంది తప్పు పడుతున్నారు.
ఓటమికి కేవలం ధోనీ పైనే నిందలు వేయడం సరికాదని, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సురైష్ రైనా తదితరులు అందరూ విఫలమవుతున్నారని, అలాంటప్పుడు ధోనీ ఏం చేస్తారని అంటున్నారు. ధోనీ తప్పుపట్టడం పట్ల విదేశీ ఆటగాళ్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాకు ధోనీ అవసరం ఉందని వెస్టిండీస్ లెజండ్ లారా అన్నారు.
రెండో వన్డేలో... మూడు పరుగులకే ఓపెనర్ రోహిత్ శర్మ పెవిలియన్ దారి పట్టగా, 50 పరుగుల తర్వాత మోర్కెల్ బౌలింగ్లో ధావన్ అవుటయ్యాడు. విరాట్ కోహ్లీ 12 పరుగుల వద్ద రనౌటయ్యాడు. తాహిర్ బౌలింగ్లో రైనా డకౌట్ కాగా, ధోనీ ఇన్నింగ్స్ను బాధ్యతలు భుజాన వేసుకున్నాడు.
చివర్లో స్పిన్నర్ హర్భజన్ సింగ్ ధోనీకి సహకారాన్ని అందిస్తూ.. 22 బంతుల్లో 22 పరుగులు చేసి స్టెయిన్ 8వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. చివర్లో మోహిత్ను అడ్డుపెట్టుకుని మూడు ఓవర్లకు పైగా ఆడిన ధోనీ, పలుమార్లు సింగిల్స్ తీసేందుకు అవకాశం లభించినా తీయకుండా స్ట్రయిక్ను కాపాడుకుంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు.
సంజయ్ మంజ్రేకర్, లక్ష్మణ్ కితాబు
ధోనీ తిరిగి తన పాత పద్ధతిలో ఆడాడని, ధోనీ నెంబర్ 4గా వస్తే బాగుంటుందని తాను భావిస్తున్నానని వీవీఎస్ లక్ష్మణ్ చెప్పాడు. కాన్పూర్ వేదిక 300 ప్లక్ వికెట్ అని చెప్పాడు. అతను చాలా బాగా ఆడాడని, తన ప్రయత్నం తాను చేశాడనని సంజయ్ మంజ్రేకర్ చెప్పాడు.