సుప్రీం తీర్పు ఎఫెక్ట్: చేతులు కలిపిన శ్రీని, ఠాకూర్
హైదరాబాద్: సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దేశంలోని 21 రాష్ట్ర సంఘాలు లోధా కమిటీ సిఫారసులను అమలు చేస్తామంటూ ముందుకొచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఎడ మొహం పెడ మొహంగా ఉన్న బీసీసీఐ మాజీ అధ్యక్షులు శ్రీనివాసన్, అనురాగ్ ఠాకూర్ ఒక్కటయ్యారు.
లోధా కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయకుండా చివరి వరకు పోరాడిన బీసీసీఐ కొత్త ఎత్తులు వేసేందుకు సిద్ధమైంది. ఐపీఎల్లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ కారణం చేత బోర్డు అధ్యక్ష పదవికి దూరమైన శ్రీనివాసన్తో అనురాగ్ ఠాకూర్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శనివారం బెంగుళూరులో జరిగిన అనధికార సమావేశానికి శ్రీనివాసన్, ఠాకూర్తోపాటు సుప్రీం కోర్టు ఆదేశాలతో పదవులను కోల్పోయిన అజయ్ షిర్కే, అమితాబ్ చౌదరీ తదితరులు హాజరయ్యారు. బీసీసీఐకి అనుబంధంగా ఉన్న 24 యూనిట్ల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో భారత క్రికెట్పై పట్టు సాధించేందుకు తదితర మార్గాలను అన్వేషించారు. లోధా కమిటీ చేసిన అన్ని సిఫారసులను అమలు చేస్తే, భారత క్రికెట్పై బీసీసీఐ పట్టు కోల్పోతుంది. అంతేకాదు దశాబ్దాల కాలంగా బీసీసీఐలో తమ ఆధిపత్యాన్ని చెలాయించిన ఎంతో మంది ప్రముఖులు దూరమవుతారు.
ముఖ్యంగా బోర్డు పాలక వర్గంలో ఎవరూ 70 సంవత్సరాల పైబడిన వారు ఉండరాదని, వరుసగా రెండు పర్యాయాలు, మొత్తం మీద మూడు సార్ల కంటే ఎక్కువగా పదవుల్లో కొనసాగడానికి వీల్లేదని లోధా కమిటీ చేసిన పలు సూచనలు వారికి ఆటంకంగా మారాయి.

లోధా సిఫారసులు మింగుపడటం లేదు
దీంతో పాటు వరుసగా రెండు సార్లు వర్కింగ్ కమిటీలో ఉండే, ఒక టెర్మ్ పోటీలకు దూరంగా ఉండాలని పేర్కొంటూ, ఆ కాలాన్ని కూలింగ్ పీరియడ్గా అభివర్ణించింది. మంత్రులెవరూ బోర్డులో కీలక పదవుల్లో ఉండరాదని లోధా కమిటీ స్పష్టం చేసింది. ఈ మూడు అంశాలను అమలు చేసేందుకు బీసీసీఐ అంగీకరించడం లేదు. దీంతో చివరకు ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరుకోవడంతో సుమారు రెండేళ్లపాటు విచారణ జరిపి చివరకు బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేసహా కొంత మంది కీలక అధికారులను తప్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది.

మాజీలంతా కలిసి ఓ సమావేశం
దీంతో భారత క్రికెట్పై తమ పట్టును సాధించేందుకు మాజీలంతా కలిసి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో బీసీసీఐపై తమ పట్టును కోల్పోకుండా తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు చివరి అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమయ్యారు. తమ ఆధీనంలో ఉన్న స్టేడియాలను మ్యాచ్లకు ఇచ్చేది లేది అనుబంధ యూనిట్లతో హెచ్చరికలు జారీ చేయించే పనిలో పడ్డారు. దేశంలోని దాదాపుగా అన్ని క్రికెట్ స్టేడియాలను బీసీసీఐ సహాయ సహకారాలతో ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘాలు నిర్మించాయి.

రాష్ట్రాల సంఘాలదీ అదే మాట
వీటిలో కొన్నింటిని నేరుగా బీసీసీఐ పర్యవేక్షిస్తున్నది. మరోవైపు స్టేడియాల నిర్వాహణ బాధ్యతలను కూడా ఆయా క్రికెట్ సంఘాలే చూసుకుంటున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి బీసీసీఐ ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం పొందలేదు. తమది స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ అంటూ బీసీసీఐ అధికారులు ఇన్నాళ్లూ చేస్తున్న వాదనను ఇకపై రాష్ట్రాల క్రికెట్ సంఘాలు వినిపించనున్నాయి. స్టేడియాలు రాష్ట్ర సంఘాల ఆధీనంలో ఉంటాయి కాబట్టి, వాటిని బీసీసీఐ నిర్వహించే మ్యాచ్లకు ఇవ్వబోమని స్పష్టం చేయనున్నాయి.

అడ్డుకునేందుకు కీలక నిర్ణయాలు
శనివారం శ్రీనివాసన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఇటువంటి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే, స్టేడియాలను మ్యాచ్లకు ఇవ్వబోమన్న కొత్త ఎత్తుగడతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నట్టు సమాచారం. బోర్డు మాజీ అధికారులు, సుప్రీం కోర్టు ఆదేశాల కారణంగా పదవిని కోల్పోయిన వారు ఇప్పుడు ఒకే జట్టుగా ఏర్పడుతున్నారు. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేస్తే తమకు పుట్టగతులు ఉండవు కాబట్టి, అలాంటి పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications