2023 ఏడాది ముగిసింది. టెస్టు ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లు మినహా మిగిలిన అన్నింట్లో టీమిండియా అదరగొట్టింది. అయితే మరింత క్రికెట్ మజాను ప్రేక్షకులకు అందించడానికి కొత్త ఏడాది 2024 ముస్తాబవుతోంది. ఈ ఏడాదిలో ఏకంగా మూడు వరల్డ్ కప్లు జరగనుండటం విశేషం. అండర్-19 వరల్డ్ కప్తో పాటు మెన్స్, ఉమెన్స్ టీ20 ప్రపంచకప్లు జరగనున్నాయి. అంతేగాక ఐపీఎల్, డబ్యూపీఎల్ క్రికెట్ లవర్స్కు మరో బోనస్.
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్లో భాగంగా తమ సిరీసుల్లో ఆఖరి టెస్టును భారత్-దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జనవరి 03 తలపడనున్నాయి. ఈ ఏడాదిలో ప్రధాన జట్ల మొదటి మ్యాచ్ వీటితోనే ప్రారంభమవుతుంది. అయితే రెండో టెస్టు అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అఫ్గానిస్థాన్తో టీమిండియా మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ జనవరి 11 నుంచి 17వరకు సాగుతుంది. మెన్స్ వరల్డ్ కప్ ముందు భారత్ ఆడే ఆఖరి టీ20 సిరీస్ ఇదే కావడం గమనార్హం.

మరోవైపు జనవరి 19నుంచి అండర్-19 టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ ప్రపంచకప్నకు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 11న ఫైనల్ జరగనుంది. కాగా, జనవరి 25 నుంచి మార్చి 11వ తేదీ వరకు ఇంగ్లాండ్తో భారత్ అయిదు టెస్టుల పటౌడీ సిరీస్ ఆడనుంది. హైదరాబాద్, వైజాగ్, రాజ్కోట్, రాంచీ, ధర్మశాల వేదికల్లో మ్యాచ్లు జరగనున్నాయి.
అనంతరం మార్చి నుంచి జూన్ మధ్యలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) షెడ్యూల్ ఉంటుంది. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ లీగ్ తేదీలు ఖరారు కాలేదు. అయితే ఐపీఎల్ తర్వాత జూన్ 4 నుంచి 30వ తేదీ వరకు మెన్స్ టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ పొట్టి కప్ టోర్నీకి వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.
ఈ టీ20 టోర్నీ ముగిసిన తర్వాత జులైలో శ్రీలంకలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. 2024లో భారత్ ఆడే ఏకైక వన్డే సిరీస్ శ్రీలంకతోనే కావడం విశేషం. ఇక స్వదేశంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారత్ బంగ్లాదేశ్తో రెండు టెస్టులు, న్యూజిలాండ్తో మూడు టెస్టులు ఆడనుంది. అదే సమయంలో బంగ్లాదేశ్ వేదికగా ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ జరగనుంది. దీనికి సన్నద్ధంగా భారత మహిళా జట్టు జనవరిలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్, డబ్యూపీఎల్ ఆడనుంది.
ఇక నవంబర్లో టీమిండియాకు అసలు సవాలు ఎదురుకానుంది. నవంబర్ నుంచి జనవరి వరకు భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది.