పూర్తి ఫిట్నెస్ సాధించకముందే కేఎల్ రాహుల్ను ఆసియా, ప్రపంచకప్లకు ఎలా ఎంపిక చేస్తారని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు గతంలో పెద్దఎత్తున విభేదించారు. రాహుల్ను వద్దన్నారు, అతడి స్థానంలో మరో ప్లేయర్కు అవకాశం ఇవ్వాలని వాదనలు వినిపించారు. కానీ కొద్ది రోజుల్లోనే వారి అంచనాలు, అభిప్రాయాలు తప్పని రాహుల్ నిరూపించాడు. ఇప్పుడు విమర్శకులతో జై జైలు కొట్టించుకుంటున్నాడు.
ఆరు నెలల తర్వాత మైదానంలో అడుగుపెట్టిన కేఎల్ రాహుల్.. ఆసియా కప్లో పాకిస్థాన్పై అజేయ శతకం (111*) సాధించాడు. ఆ తర్వాత జరిగిన వన్డే వరల్డ్ కప్లో పరుగుల వరద పారించాడు. 10 ఇన్నింగ్స్ల్లో 75 సగటుతో 452 పరుగులు చేశాడు. అంతేగాక పరిస్థితులకు తగ్గట్టుగా జాగ్రత్తగా, దూకుడుగా గేర్లు మార్చుతూ జట్టుకు విజయాలు అందించాడు.

తాజాగా బలమైన దక్షిణాఫ్రికా పేసర్లను కఠిక పిచ్పై సమర్థంగా ఎదుర్కొంటూ కేఎల్ రాహుల్ (101) వీరోచితక శతకం సాధించాడు. కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ (5), విరాట్ కోహ్లి (38), శ్రేయస్ అయ్యర్ (31) తడబడినా రాహుల్ మాత్రం పోరాటం కొనసాగించాడు. 121/6 పరుగులతో ఉన్న టీమిండియా 245 పరుగులు సాధించిందంటే అది రాహుల్ గొప్పతనమే. మరో ఎండ్లో వికెట్లు పడుతుండటంతో టీ20 మోడ్లోకి వెళ్లి బౌండరీలతో హోరెత్తించాడు.
మొత్తంగా గాయాలతో టీమిండియాకు దూరమైనా.. 2023లో బెస్ట్ కమ్బ్యాకర్గా కేఎల్ రాహుల్ అదిరే రీఎంట్రీ ఇచ్చాడు. అయితే సౌతాఫ్రికా టెస్టులో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. సెంచూరియన్ మైదానంలో రెండు సెంచరీలు సాధించిన ఏకైక పర్యాటక జట్టు ప్లేయర్గా నిలిచాడు. 2021-22 దక్షిణాఫ్రికా పర్యటనలో ఇదే గ్రౌండ్లో అతడు 123 పరుగులు చేశాడు.
అలాగే ఆసియా వెలుపల సెంచరీ సాధించిన టీమిండియా అయిదో వికెట్ కీపర్గా రికార్డు నెలకొల్పాడు. ఇక సౌతాఫ్రికాలో రెండు లేదా అంతకంటే ఎక్కువ శతకాలు సాధించిన అయిదో భారత్ బ్యాటర్గా రికార్డు సాధించాడు.