ప్రపంచకప్లో రిజర్వు డేలు:
న్యూజిలాండ్ వేదికగా వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ బుధవారం విడుదలైంది. ఈ వన్డే ప్రపంచకప్ సెమీస్, ఫైనల్ మ్యాచులకు రిజర్వు డే కేటాయించామని ఐసీసీ తెలిపింది. 2021, ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7 వరకు రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహించే ఈ మెగా టోర్నీలో మొత్తం 31 మ్యాచులు ఉంటాయి. మొత్తం ఆరు వేదికలు ఈడెన్ పార్క్, బే ఓవల్, సెడాన్ పార్క్, యూనివర్సిటీ ఓవల్, బేసిన్ రిజర్వ్, హాగ్లె ఓవల్ ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి.
ఆక్లాండ్లో తొలి మ్యాచ్:
ఫిబ్రవరి 13న బేసిన్ రిజర్వులో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య ట్రాన్స్మన్ పోరు జరుగుతుంది. ఆక్లాండ్లో తొలి మ్యాచ్ ఉంటుంది. మార్చి 3 టారంగ, 4న హామిల్టన్లో సెమీ ఫైనల్ మ్యాచులు జరుగుతాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటికే ప్రపంచకప్నకు అర్హత సాధించాయి. మిగతా నాలుగు జట్లు ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్, శ్రీలంకలో జులైలో జరిగే అర్హత పోటీల్లో ఆడి ఎంపికవుతాయి. ప్రతి జట్టూ అన్ని దేశాలతో ఆడుతుంది. అగ్రస్థానంలో నిలిచిన నాలుగు దేశాలు సెమీస్కు ఎంపికవుతాయి.
5.5 మిలియన్ న్యూజిలాండ్ డాలర్లు:
ప్రపంచకప్కి 5.5 మిలియన్ న్యూజిలాండ్ డాలర్లను ఐసీసీ బహుమతిగా ప్రకటించింది. మ్యాచులన్నీ ప్రత్యక్ష ప్రసారం కానున్నాయని తెలిపింది. 'మహిళల క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ కట్టుబడి ఉంది. గత కొన్నేళ్లతో పోలిస్తే.. ప్రస్తుత బహుమతి ప్రైజ్ మనీ పెరిగింది. 2021 టోర్నీకి 5.5 మిలియన్ న్యూజిలాండ్ డాలర్లు ఇస్తున్నాం. 2017లో ఇది 3.1 మిలియన్ న్యూజిలాండ్ డాలర్లు. 2013లో 316,000 న్యూజిలాండ్ డాలర్లు ఇచ్చాం' అని ఐసీసీ సీఈవో మను సాహ్నీ ఓ ప్రకటనలో తెలిపారు.