
హైదరాబాద్: 2019 సంవత్సరం తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఇచ్చిందని టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్లో "విజయాలు, కఠోర శ్రమ, అభ్యాసాలు, జ్ఞాపకాలతో మైదానం లోపలా బయటా 2019 ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ సంవత్సరానికి ఇదే ఆఖరి రోజు. 2020 అందించే ప్రతిదాని కోసం ఎదురుచూస్తున్నాను" అంటూ ట్వీటాడు.
వెన్ను గాయం కారణంగా గత నాలుగు నెలలు అంతర్జాతీయ క్రికెట్కు దూరమైనప్పటికీ ఈ ఏడాది బుమ్రాకు ఓ అద్భుతమైన సంవత్సరంగా చెప్పొచ్చు. 26 ఏళ్ల ఈ ఏడాది మూడు టెస్టులు ఆడి 13.14 సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు ఐదు వికెట్లు హాల్స్ ఉన్నాయి.
వెస్టిండిస్తో నార్త్ సౌండ్ మరియు కింగ్స్టన్ వేదికగా జరిగిన టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండిస్లలో ఐదు వికెట్లు పడగొట్టిన ఏకైక ఆసియా బౌలర్గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో పాటు ఈ ఏడాది టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
ఇటీవలే గాయం నుంచి తిరిగి కోలుకున్న బుమ్రా జనవరిలో ప్రారంభం కానున్న శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్లకు ఎంపికయ్యాడు. వరల్డ్కప్ 2019 ముగిసిన తర్వాత వెస్టిండిస్ పర్యటనలో మెరిసిన బుమ్రా ఆ తర్వాత టీమ్కు దూరమయ్యాడు. ఒత్తిడి కారణంగా బుమ్రా వెన్నులో కింది వైపున చిన్న చీలిక వచ్చిందని వైద్యులు తేల్చారు.
కాగా, వచ్చే ఏడాదిని టీమిండియా శ్రీలంక జట్టుతో జరగనున్న టీ20 సిరిస్తో ప్రారంభించనుంది. భారత పర్యటనలో భాగంగా శ్రీలంక మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరిస్లో తలపడనుంది. శ్రీలంక సిరిస్ జనవరి 5 నుంచి 10 వరకు జరగనుంది.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరిస్ జనవరి 14 నుంచి 19 వరకు జరుగుతుంది. తొలి టీ20 జనవరి 5న గౌహతి వేదికగా ప్రారంభం కానుంది. ఆ తర్వాత 7వ తేదీన ఇండోర్, 10వ తేదీన పూణె వేదికగా జరగనుంది.
శ్రీలంకతో టీ20 సిరిస్కు టీమిండియా:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శివం దుబే, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీద్ బుమ్రా, నవ్ద్రిత్ బుమ్రా మనీష్ పాండే, వాషింగ్టన్ సుందర్, సంజు సామ్సన్.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు టీమిండియా:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, శివం దుబే, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ ఠాకూర్, మనీష్ పాండే, వాషింగ్టన్ సుందర్, సంజు సామ్సన్.