
ముంబై: టీమిండియా కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఫోర్బ్స్ ఇండియా-2019 సెలబ్రిటీ జాబితాలో 'టాప్' లేపాడు. వన్డే, టెస్ట్ ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీ.. తాజాగా భారత టాప్-100 సెలబ్రిటీల్లోనూ నంబర్వన్గా నిలిచాడు. గతేడాది రెండో స్థానంలో నిలిచిన కోహ్లీ ఈ ఏడాది రూ.252.72 కోట్లతో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గత ఎనిమిదేళ్లుగా ఫోర్బ్స్ ఇండియా ప్రకటిస్తోన్న టాప్-100 సెలబ్రిటీల జాబితాలో కోహ్లీ చోటు దక్కించుకుంటూనే ఉన్నాడు.
గతేడాది మూడో ర్యాంకులో నిలిచిన బాలీవుడ్ స్టార్ హీరో, సూపర్స్టార్ అక్షయ్ కుమార్ ఈ ఏడాది రూ. 293.25 కోట్లతో టాప్ సెలబ్రిటీల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. 2018లో అగ్రస్థానంలో నిలిచిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈసారి మూడో స్థానంలో నిలిచాడు. 2016 నుంచి అగ్రస్థానంలో ఉన్న సల్మాన్ సంపాదన ఈ ఏడాది రూ. 229.25 కోట్లుగా ఉంది. నాలుగో స్ధానంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (రూ. 239.25 కోట్లు) ఉండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (రూ.135.93 కోట్లు) ఐదో స్థానంలో ఉన్నాడు.
ఫోర్బ్స్ జాబితా ర్యాంకుల్ని కేవలం ఆదాయంతోనే లెక్కించరు. ఆ లెక్కన చూస్తే.. అక్షయ్ టాప్లో ఉండేవాడు. ఫోర్బ్స్ లెక్కకు
ఆదాయంతో పాటు, పేరు ప్రఖ్యాతులు, ప్రసార మాధ్యమాల్లోని క్రేజ్, సామాజిక సైట్లలో అనుసరిస్తున్న వారి సంఖ్య (ఫాలోవర్స్) లాంటి అంశాలను బట్టి ర్యాంకింగ్ను కేటాయిస్తారు. గతేడాది అక్టోబర్ 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఈ అంశాలను లెక్కలోకి తీసుకున్న ఫోర్బ్స్ మేగజైన్.. కోహ్లీకి అగ్రతాంబూలం ఇచ్చింది.
ఫోర్బ్స్ ఇండియా-2019 సెలబ్రిటీ జాబితా టాప్-100లో ఈ ఏడాది క్రీడాకారుల సంఖ్య పెరిగింది. మొత్తం 21 మంది క్రీడాకారులకు చోటు దక్కింది. క్రికెటర్లు కాకుండా బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్.. సునీల్ ఛెత్రి (ఫుట్బాల్), మేరీకోమ్ (బాక్సింగ్), బజరంగ్ (రెజ్లింగ్), అనిర్బన్ (గోల్ఫ్), బోపన్న (టెన్నిస్) కూడా ఈ జాబితాలో ఉన్నారు.