
హైదరాబాద్: ఆస్ట్రేలియాపై 2014లో అడిలైడ్లో చేసిన సెంచరీయే తన టెస్టు కెరీర్లోనే అత్యుత్తమమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. గురువారం CNN-News18 Indian of the Year 2017 అవార్డుల కార్యక్రమం విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు. కోహ్లీకి పాపులర్ ఛాయిస్ స్పెషల్ అఛీవ్మెంట్ పురస్కారం దక్కింది.
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ 'నా కెరీర్ మలుపు తిరిగే క్రమంలో 2014 డిసెంబర్లో ఆస్ట్రేలియాపై అడిలైడ్ వేదికగా రెండో ఇన్నింగ్స్లో సాధించిన సెంచరీయే ఉత్తమం. ఎందుకంటే ఈ మ్యాచ్లో భారత్ దాదాపు గెలుపు అంచుల వరకు వెళ్లింది. ఆ మ్యాచ్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటా' అని కోహ్లీ తెలిపాడు.
ఈ టెస్టు మ్యాచ్కి విరాట్ కోహ్లీనే సారథ్య బాధ్యతలను వహించాడు. 'ఆస్ట్రేలియా ఎంత లక్ష్యాన్ని మా ముందుంచినా.. ఛేదించడానికే ప్రయత్నించాలని జట్టులోని సహచరులతో చెప్పా. టీమ్ బస్సులో ఇదే విషయంపై చర్చించా. ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉంటే ఇప్పుడే చెప్పండి లేదంటే లక్ష్య సాధనకు సిద్ధపడండి. వాళ్లు కూడా సానుకూలంగా స్పందించారు. అందుకే విజయం కోసం చివరి వరకు ప్రయత్నించాం' అని కోహ్లీ చెప్పాడు.
రెండో ఇన్నింగ్స్లో భయంకరమైన ఆసీస్ పేస్ బౌలింగ్ దాడిని ఎదుర్కొని కోహ్లి 141 పరుగులు చేశాడు. ఈ టెస్టులో ఆస్ట్రేలియా నిర్దేశించిన 364 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీసేన చివరిదాకా పోరాడిన 315 పరుగులకు ఆలౌటైంది. దీంతో 48 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్లో అడిలైడ్లో తీవ్ర ఒత్తిడిలో చేసిన సెంచరీతో విరాట్ కోహ్లీ టీమిండియాను దాదాపుగా గెలిపించింత పని చేశాడు. ఈ మ్యాచ్కి ధోని గాయం కారమంగా దూరం కావడంతో కోహ్లీ తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాడు. భారత్ తరుపున 62 టెస్టులాడిన కోహ్లీ ఇప్పటివరకు 19 సెంచరీలు చేశాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.