మిగిలింది కోహ్లీనే
ఫైనల్ మ్యాచ్లో అంత గొప్ప విజయం సాధించిన భారత జట్టులోని ఆటగాళ్లలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఒక్కడే క్రికెట్లో కొనసాగుతుండడం గమనార్హం. నాటి మిగతా దిగ్గజ క్రికెటర్లంతా ఇప్పటికే ఆటకు వీడ్కోలు పలికారు. బుధవారం శ్రీశాంత్ కూడా క్రికెట్కు రిటెర్మెంట్ ప్రకటించడంతో 2011 ఫైనల్ మ్యాచ్ ఆడిన భారత జట్టులోని ఆటగాళ్లలో ఇక విరాట్ కోహ్లీ ఒక్కడే మిగిలాడు. ఆ ప్రపంచకప్ గెలిచినప్పుడు విరాట్ కోహ్లీ వయసు 22 సంవత్సరాలు మాత్రమే కావడం గమనార్హం. ఆ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఆడిన సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్సింగ్, సురేష్ రైనా, హర్బజన్ సింగ్, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, శ్రీశాంత్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. ధోని ఐపీఎల్లో ఆడుతున్నప్పటికీ 2020లోనే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పేశాడు. దీనికి సంబంధించిన ఓ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారంది.
మళ్లీ ఆడని ఆ జట్టు
దురదృష్టవశాత్తూ 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టులోని ఆటగాళ్లంతా కలిసి ఆ తర్వాత మళ్లీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు. ఇదే విషయాన్ని గౌతం గంభీర్, యువరాజ్ సింగ్ వంటి ఆటగాళ్లు పలుమార్లు గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ అనంతరం ఆ 11 మందిలోని పలువురు ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. తిరిగి వచ్చిన అందరూ ఒకే సారి అందుబాటులో ఉండలేకపోయారు. ఇక గాయాల నుంచి కోలుకుని సరైన ఫిట్నెస్ సాధించలేక పలువురు ఆటకే గుడ్బై చెప్పేశారు. ఆ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న యువరాజ్ సింగ్ అయితే వరల్డ్కప్ ముగియగానే క్యాన్సర్ బారిన పడి జట్టుకు దూరమయ్యాడు. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చినప్పటికీ
అప్పటికే పలువురు ఆటగాళ్లు టీంకు దూరమయ్యారు.
నాటి తీపి జ్ఙాపకాలు
నాటి ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసింది. మహేల జయవర్దనే అజేయ సెంచరీతో చెలరేగడంతో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. 275 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను లసిత్ మలింగ ఆదిలోనే దెబ్బ కొట్టాడు. నాటి దిగ్గజ ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ను 18 పరుగులకే ఫెమిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో గౌతం గంభీర్ జట్టును ఆదుకున్నాడు. విరాట్ కోహ్లీ (35), కెప్టెన్ ధోని (91)తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పడమే కాకుండా జట్టును విజయానికి చేరువ చేశాడు. గంభీర్, ధోని నెలకొల్పిన సెంచరీ భాగస్వామ్యం జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. సెంచరీకి చేరువలో గంభీర్ (97) ఔటైనప్పటికీ యువరాజ్సింగ్తో కలిసి ధోని టీంకు విజయాన్ని అందించాడు. చివరకు సిక్సుతో భారత్ను ప్రపంచకప్ గెలిపించాడు.
2011 వరల్డ్కప్ ఫైనల్ భారత జట్టు
సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), యువరాజ్సింగ్, సురేష్ రైనా, హర్బజన్ సింగ్, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, శ్రీశాంత్.