సరిగ్గా పన్నెండేళ్ల క్రితం.. ఇదే రోజున.. భారత జట్టు చరిత్ర సృష్టించింది. వంద కోట్ల మంది భారత అభిమానుల కలను సాకారం చేస్తూ వన్డే వరల్డ్ కప్ను ముద్దాడింది. ఆ మధుర క్షణాలు ఇప్పటికీ అభిమానుల మనసుల్లో ఫ్రెష్గానే ఉన్నాయి. ఆ కప్పు నెగ్గిన జట్టు కూడా ఆ క్షణాలను మర్చిపోలేదు. అందుకే ఈ అరుదైన ఘట్టం జరిగిన పన్నెండు వసంతాలను తమదైన స్టైల్లో గుర్తుచేసుకున్నారు. అభిమానులు కూడా మరోసారి ఆ రోజును గుర్తుచేసుకున్నారు.
2011 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత జట్టు.. ఫైనల్ చేరింది. ఫైనల్లో శ్రీలంక, భారత్ జట్లు వాంఖడే వేదికగా ట్రోఫీ కోసం తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 274 పరుగుల మంచి స్కోరు చేసింది. మహేల జయవర్దనే (103 నాటౌట్) చెలరేగగా.. కెప్టెన్ కుమార సంగక్కర (48) కూడా ఫర్వాలేదనిపించాడు. లక్ష్య ఛేదనలో భారత్ను లంక పేసర్ లసిత్ మలింగ ఆరంభంలోనే దెబ్బతీశాడు.

మలింగ దెబ్బకు వీరేంద్ర సెహ్వాగ్ (0), సచిన్ టెండూల్కర్ (18) ఇద్దరూ త్వరగానే పెవిలియన్ చేరారు. ఇలాంటి సమయంలో గౌతమ్ గంభీర్ (97), విరాట్ కోహ్లీ (35) కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్లో అద్భుతంగా పోరాడినా కూడా చివర్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన గంభీర్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇలాంటి సమయంలో తనను తాను ప్రమోట్ చేసుకున్న ఎంఎస్ ధోనీ (91 నాటౌట్), యువరాజ్ సింగ్ (21 నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఈ మ్యాచ్లో విజయం కోసం ధోనీ చివర్లో బాదిన సిక్సర్ ఇప్పటికీ భారత అభిమానుల మదిలో నిలిచిపోయింది. ఈ విజయాన్ని గుర్తుచేసుకున్న సచిన్ టెండూల్కర్.. 'పన్నెండేళ్ల క్రితం భారత జట్టు వరల్డ్ కప్ ముద్దాడింది. ఇది నా జీవితంలోనే గొప్ప క్షణం. అప్పుడు మీరెక్కడున్నారు? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు?' అని ట్వీట్ చేశాడు. వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న యువరాజ్.. 'పట్టుదలతో.. ఓటమిని జయించిన జట్టు. ఆ గొప్ప జట్టుతో పన్నెండేళ్ల క్రితం వరల్డ్ కప్ నెగ్గాం' అని పేర్కొన్నాడు. ఈ విజయంలో పాల్గొన్న సురేష్ రైనా, హర్భజన్ సింగ్, మునాఫ్ పటేల్ తదితరులు అందరూ కూడా ఈ విజయాన్ని గుర్తుచేసుకుంటూ ట్వీట్లు పంచుకున్నారు.