రానున్న లోక్సభ ఎన్నికల్లో టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ పోటీచేయనున్నాడు. పశ్చిమ బెంగాల్లోని బరంపూర్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) తరఫున పఠాన్ బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని టీఎంసీ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. భారీ బహిరంగ సభలో 42 మందితో కూడిన తమ పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితాను టీఎంసీ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో 2011 ప్రపంచకప్ విజేత జట్టులో రాజకీయాల్లో చేరిన మూడో ఆటగాడిగా యూసఫ్ పఠాన్ నిలవనున్నాడు. గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్ ఇప్పటికే రాజకీయాల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి గంభీర్ ఎంపీగా ఎన్నికయ్యాడు. కానీ ఈ సారి ఎన్నికల్లో పోటీచేయడట్లేదని గంభీర్ ఇటీవల ప్రకటించాడు.

2011 వన్డే వరల్డ్ కప్ జట్టులో పాటు 2007 టీ20 ప్రపంచకప్ విజేత జట్టులోనూ యూసఫ్ సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. యూసఫ్ పఠాన్ భారత్ తరఫున 57 వన్డేలు, 22 టీ20లు ఆడాడు. వన్డేల్లో 27 సగటుతో 810 పరుగులు చేశాడు. 33 వికెట్లు పడగొట్టాడు. అలాగే టీ20ల్లో 236 పరుగులు, 13 వికెట్లు సాధించాడు. వన్డేల్లో తన మొదటి, చివరి మ్యాచ్లు పాకిస్థాన్పైనే ఆడాడు.
కాగా, ప్రస్తుతం బరంపూర్ ఎంపీగా కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరీ ఉన్నారు. గతంలో అయిదు సార్లు బరంపూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన అధిర్ రంజన్కు అదే స్థానంలో మరోసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుంది. అయితే ఇండియా కూటమిలో టీంఎసీతో కలిసి పోటీచేయాలని భావించిన కాంగ్రెస్కు ఈ నిర్ణయం ప్రతికూలంగా మారింది. చర్చించకుండా టీఎంసీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తప్పుబట్టారు.
''వెస్ట్ బెంగాల్లో టీఎంసీతో గౌరవప్రదమైన సీట్ల భాగస్వామ్య ఒప్పందం ఉండాలని కాంగ్రెస్ పలుమార్లు ప్రకటించింది. ఇలాంటి ఒప్పందాలను చర్చల ద్వారా జరాలని, ఏకపక్ష నిర్ణయాలు ద్వారా ప్రకటించకూడదని కాంగ్రెస్ ఎప్పుడూ పేర్కొంటుంది. ఇండియా కూటమితో కలిసి బీజేపీపై పోరాడాలని కాంగ్రెస్ భావిస్తోంది'' అని జైరాం రమేష్ పేర్కొన్నారు.