హైదరాబాద్: భారత క్రికెట్లో 2007 వరల్డ్ కప్ సమయం అత్యంత చెడు సమయమని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభివర్ణించాడు. 2007 వరల్డ్ కప్లో టీమిండియా కనీసం సూపర్ 8 స్టేజికి కూడా క్వాలిఫై అవకపోవడంపై సచిన్ మంగళవారం ముంబైలో ఓ కార్యక్రమంలో స్పందించాడు.
'2006-07 మధ్య కాలం భారత క్రికెట్కు కచ్చితంగా చెడు సమయమనే చెప్పాలి. ప్రధానంగా 2007 వరల్డ్ కప్లో కనీసం సూపర్ 8 స్టేజ్ కూడా క్వాలిఫై కాలేకపోయాం. ఆఖరికి బంగ్లాదేశ్, శ్రీలంకలతో జరిగిన మ్యాచ్లను సైతం ఓటమి పాలయ్యాం' అని సచిన్ పేర్కొన్నాడు.

'అది భారత క్రికెట్లో అత్యంత చెడు సమయని నేను అనుకుంటున్నా. అసలు ఆ సమయంలో భారత క్రికెట్లో ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. మేము చేసేది తప్పా? ఒప్పా? అనేది తెలియలేదు. ఏదో ఆడుకుంటూ వెళ్లడం తప్పితే.. సరైన మార్గదర్శకత్వంలో ఆడుతున్నట్లు కనిపించలేదు' అని సచిన్ చెప్పుకొచ్చాడు.
'అయితే ఆ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత జట్టులో చాలా మార్పులు జరగాలని అనుకున్నాం. జట్టుగా ఏమి సాధించాలనే దాని కోసం కచ్చితమైన ప్రణాళికలు సిద్ధం చేశాం. జట్టులో మార్పు అనేది రాత్రికి రాత్రే వచ్చేది కాదు.. ఫలితాలు కోసం నిరీక్షించాం. నా క్రీడా జీవితంలో మరుపురానిది ఏదైనా ఉందంటే అది ధోని నేతృత్వంలో సాధించిన 2011 వరల్డ్ కప్' అని సచిన్ పేర్కొన్నాడు.
2007 వరల్డ్ కప్లో రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని టీమిండియా గ్రూప్ స్టేజిలోనే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ అనంతరం రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. సచిన్ సూచన మేరకు కెప్టెన్సీని మహేంద్ర సింగ్ ధోనికి అప్పగించారు.
కాగా, భారత క్రికెట్ జట్టు చరిత్రలో రెండు సార్లు వన్డే వరల్డ్ కప్ను టీమిండియా సాధించింది. తొలిసారి 1983లో కపిల్ దేవ్ నేతృత్వంలో వరల్డ్ కప్ను కైవసం చేసుకున్న భారత జట్టు.. 2011లో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో రెండో సారి వరల్డ్ కప్ను నెగ్గింది.