న్యూఢిల్లీ: 2000 సంవత్సరం మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో కీలక నిందితుడు, ప్రధాన బుకీ సంజీవ్ చావ్లాను గురువారం ఉదయం ఢిల్లీ పోలీసులు భారత్కు తీసుకువచ్చారు. యునైటెడ్ కింగ్డమ్ (ఇంగ్లాండ్) నుంచి ఢిల్లీకి తీసుకొచ్చిన పోలీసులు అతడిని తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది. అయితే అంతకుముందే సంజీవ్ చావ్లాకు అవసరమైన వైద్య పరీక్షలు జరుపనున్నారు.
అసలు సెన్స్ ఉందా మీకు.. బీసీసీఐ సెలక్షన్ కమిటీపై ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ ఫైర్!!
2000 సంవత్సరంలో అప్పటి దక్షిణాఫ్రికా కెప్టెన్, దివంగత హన్సీ క్రోనేను ఫిక్సింగ్కు పాల్పడేలా ప్రోత్సహించాడని సంజీవ్ చావ్లాపై అభియోగాలు ఉన్నాయి. 2000 ఏడాది ఫిబ్రవరిలో భారత పర్యటనకు దక్షిణాఫ్రికా వచ్చింది. ఈ సందర్భంగా హన్సీను ఫిక్సింగ్కు పాల్పడేలా సంజీవ్ ప్రభావితం చేశాడు. 21వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచ క్రికెట్ను కదిలించిన మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో 50 ఏళ్ల బ్రిటిష్ జాతీయుడు కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఢీల్లీ పోలీసులు దాఖలు చేసిన 2013 చార్జిషీట్లో హెర్షెల్ గిబ్స్, నిక్కీ బోజే పేర్లు కూడా ఉన్నాయి. 2002లో విమాన ప్రమాదంలో మరణించిన క్రోనేపై విచారణను రద్దు చేసారు. అయితే ఈ కేసులో ఇంకా ఐదుగురుని ప్రధాన నిందితులుగా పేర్కొంది. ఇక మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి దక్షిణాఫ్రికాలో ఏర్పాటు చేసిన కింగ్స్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ముందు గిబ్స్ నేరం అంగీకరించాడు.
కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటూ ఇంగ్లాండ్లో ఉంటున్న సంజీవ్ చావ్లాను గురువారం ఢిల్లీ పోలీసులు విచారణ నిమిత్తం భారత్కు తీసుకొచ్చారు. అంతకుముందు స్థానిక అధికారుల వద్ద సంజీవ్ను అప్పగించేందుకు అనుమతి తీసుకున్నారు. దీంతో 1992 భారత్-ఇంగ్లాండ్ నేరగాళ్ల అప్పగింత ఒప్పందం తర్వాత ఆ పెద్ద స్థాయి కేసు ఇదే కావడం గమనార్హం. సంజీవ్ ఢిల్లీలో జన్మించి 1996లో వ్యాపార వీసాపై ఇంగ్లాండ్కు వెళ్ళాడు. 2000లో సంజీవ్ భారతీయ పాస్పోర్ట్ రద్దు చేయబడగా.. 2005లో యూకే పాస్పోర్ట్ పొంది బ్రిటిష్ పౌరుడు అయ్యాడు.