భువనేశ్వర్: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆడకుండా పాక్ హాకీ ఆటగాళ్లు అంజాద్ అలీ, మహమ్మద్ తౌసిక్పై అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వేటు వేసింది. భారత్తో శనివారం జరిగిన సెమీస్ మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకులకు అసభ్యకర సంజ్ఞలు చేసిన పాక్ ఆటగాళ్లపై ఎఫ్ఐహెచ్ కొరఢా ఝుళిపించింది.
దోషులుగా తేలిన అంజాద్, తౌసిస్పై తక్షణం ఓ మ్యాచ్ నిషేధం విధించింది. పాక్ ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే భారత్లో జరబోయే అంతర్జాతీయ టోర్నీలను బహిష్కరిస్తామని భారత హాకీ సంఘం (హెచ్ఐ) గట్టిగా హెచ్చరించిన నేపథ్యంలో ఎఫ్ఐహెచ్ దిగొచ్చింది.
ఆటగాళ్లు తమ తప్పును ఒప్పుకున్నారనీ, వారిద్దరినీ క్రమశిక్షణ చర్యల కింద ఫైనల్మ్యాచ్ నుంచి తప్పించినట్లు ఎఫ్ఐహెచ్ తెలిపింది. జట్టులోని మరో ఆటగాడు షఫకత్ రసూల్ను మందలించి వదిలేసినట్లు పేర్కొంది.
పాక్తో తెగదెంపులు: హెచ్ఐ చీఫ్ బాత్రా హెచ్చరిక
న్యూఢిల్లీ: భారత్తో సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్థాన్ ఆటగాళ్ల అనుచిత ప్రవర్తనను హాకీ ఇండియా (హెచ్ఐ) సీరియస్గా తీసుకుంది. ఈ ఘటకు సంబంధించి ఇద్దరు పాక్ ఆటగాళ్లపై కేవలం ఒక మ్యాచ్ నిషేధం విధించడంపై హెచ్ఐ అధ్యక్షుడు నరీందర్ బాత్రా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ శిక్ష సరిపోదన్న బాత్రా, ఈ ఉదంతంపై పాక్ హాకీ సమాఖ్య (పీహెచ్ఎఫ్) బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు.
ఒకవేళ పీహెచ్ఎఫ్ బేషరతు క్షమాపణలు చెప్పకపోతే భవిష్యత్లో పాక్తో ద్వైపాక్షిక సంబంధాలన్నీ తెంచేసుకుంటామనీ హెచ్చరించారు. 'పాక్ జట్టు కోచ్ క్షమాపణలు చెబితే సరిపోదు. ఆ దేశ హాకీ సమాఖ్య బేషరతు క్షమాపణలు చెప్పాలి. లేదంటే పాక్తో హాకీ సంబంధాలకు పుల్స్టాప్ పెడతాం' అని బాత్రా అన్నారు.