
కరాచీ: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో కరోనా వైరస్ మరోసారి కలకలం రేపింది. సోమవారం ఆస్ట్రేలియాకు చెందిన ఫవాద్ అహ్మద్ (ఇస్లామాబాద్ యునైటెడ్)కు పాజిటివ్గా తేలగా.. మంగళవారం మరో మూడు కేసులు బయటపడడంతో ఆందోళన రెట్టింపైంది. ఇద్దరు విదేశీ ఆటగాళ్లతో పాటు ఒక సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. వారిని వెంటనే ఐసొలేషన్కు తరలించారు. వీరిలో ఒకరు ఫవాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇస్లామాబాద్ ఫ్రాంఛైజీకి చెందిన ఆటగాడు ఉన్నాడు. మిగిలిన ఇద్దరు వేర్వేరు జట్లకు చెందిన వాళ్లు.
కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నా టోర్నీ మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. 'లీగ్లో పాల్గొంటున్న ఇద్దరు విదేశీ ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్గా తేలింది. మొత్తం అన్ని ఫ్రాంచైజీల్లో మొత్తం 242 పీసీఆర్ టెస్టులు నిర్వహించగా.. ముగ్గురికి పాజిటివ్గా తేలింది. ఇంకా ఒక టీమ్కు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్లు జరుగుతాయి' అని పీసీబీ డైరెక్టర్ ఆఫ్ మీడియా సామి బుర్నీ పేర్కొన్నారు.
బయో సెక్యూర్ బబూల్ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికే కొత్త నిబంధనలకు సంబంధించి వివరాలను ఆయా ఫ్రాంచైజీలకు పంపించామని సామి బుర్నీ తెలిపారు. ఆటగాళ్ల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చెమన్నారు. ఇస్లామాబాద్ యునైటెడ్ ఆటగాడు ఫాహిద్ అహ్మద్ సోమవారం కరోనా బారీన పడడంతో క్వెటా గ్లాడియేటర్స్తో జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. అయితే బయో బబుల్ నిబంధనలను పీసీబీ కఠినంగా అమలు చేయకపోవడం వల్లే ఇలా కేసులు వచ్చాయనే విమర్శలు మొదలయ్యాయి.
కరోనా ప్రభావం టోర్నీపై పడేందుకు ఆస్కారముందని పాకిస్తాన్ మీడియా చెప్పుకొచ్చింది. 'క్వారంటైన్ నిబంధనలను పక్కనపెట్టి క్రికెటర్ల కుటుంబ సభ్యులను కూడా బయో బుడగలోకి అనుమతించారు. జట్లు బస చేసే హోటళ్లలో కొన్ని ఈవెంట్లతో పాటు విందులు కూడా జరిగాయి. బయట నుంచి ఆహారాన్ని కూడా ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు. క్రికెటర్లు బయో బుడగలో ఉన్నా వారికి సమీపంగా సేవలందించే మైదాన సిబ్బంది రోజూ ఇంటికి వెళ్లొస్తున్నారు. వారికి ఎలాంటి నిబంధనలు పెట్టలేదు' అని అక్కడి పత్రికలు రాసుకొచ్చాయి.