
హైదరాబాద్: 2020-21లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా 2 డే నైట్ టెస్టుల ప్రతిపాదనపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తనను సంప్రదించలేదని బోర్డ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం తెలిపాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడనుంది.
ఇందులో భాగంగా టీమిండియాతో ఒకటి కంటే ఎక్కువ డే నైట్ టెస్టులు ఆడించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో 2 డే నైట్ టెస్టులు ఆడటం "కొంచెం ఎక్కువ" అని సౌరవ్ గంగూలీ అన్నాడు. ఈ మేరకు ఇండియా టుడే కాన్క్లేవ్ ఈస్ట్ 2019లో వ్యాఖ్యానించాడు.
గంగూలీ మాట్లాడుతూ టెస్ట్ క్రికెట్ను సరిగ్గా మార్కెట్ చేయాల్సిన అవసరం ఉందని... అందుకు పింక్ బాల్ టెస్టులు మంచి మార్గమని అన్నాడు. "ఆస్ట్రేలియాలో భారత్ 2 డే నైట్ టెస్టులు ఆడటానికి వెళుతుందా? అనేది ఖచ్చితంగా తెలియదు. 4లో 2 టెస్టులు పింక్ బాల్తో అంటే మరీ టూమచ్. నేను ఈ ఉదయం వార్తాపత్రికలలో చదివాను" అని అన్నాడు.
"క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి తాను ఎటువంటి అధికారిక ప్రతిపాదనను వినలేదు. అది వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తాం. సంప్రదాయ టెస్టు మ్యాచ్లను ఇవి భర్తీ చేయలేవు. అయితే, ప్రతీ సిరీస్లో ఒక పింక్బాల్ టెస్టు ఉండేలా చూసుకుంటాం" అని సౌరవ్ గంగూలీ వెల్లడించాడు.
కాగా, జనవరి 14 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా సీఏ చైర్మన్ ఎర్ల్ ఎడింగ్స్ నేతృత్వంలోని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందం బీసీసీఐ ప్రతినిధులతో సమావేశం కానుంది. ఈ సందర్భంగా ఒకటి కంటే ఎక్కువ డే నైట్ టెస్టులపై ప్రతిపాదన తీసుకురానున్నట్టు సమాచారం.