
హైదరాబాద్: బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. 307 పరుగుల లోటుతో ఓవర్నైట్ స్కోరు 174/4తో నాలుగో రోజు ఆదివారం ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో చివరి వరకు పోరాడి 429 పరుగుల వద్ద ఆలౌటైంది.
సౌమ్య సర్కార్ (149), మహ్మదుల్లా (146) సెంచరీలు సాధించడంతో ఆతిథ్య జట్టు విజయాన్ని ఆలస్యం చేశారు. దాదాపు 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఈ ఇద్దరూ ఐదో వికెట్కు 235 పరుగులు జోడించారు. దీంతో బంగ్లా రెండో ఇన్నింగ్స్లో 103 ఓవర్లలో 429 పరుగుల వద్ద ఆలౌటైంది. ఈ ఇద్దరి ఔట్ తర్వాత బంగ్లా చివరి ఐదు వికెట్లను 18 ఓవర్లలో చేజార్చుకుంది.
లిట్టన్ దాస్ (1), మెహెదీ హసన్ (1), అబు జాయేద్ (3), ఖలీద్ అహ్మద్ (4 నాటౌట్), మహ్ముదుల్లా(0, )హుస్సేన్ (0) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దీంతో మరో రోజు మిగిలుండగానే మ్యాచ్ ముగిసింది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ ఐదు వికెట్లు పడగొట్టగా.. సౌథీ మూడు వికెట్లు, వాగ్నర్ రెండు వికెట్లు పడగొట్టారు.
డబుల్ సెంచరీ సాధించిన కివీస్ సారథి విలియమ్సన్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మార్చి 8(శుక్రవారం) నుంచి వెల్లింగ్టన్ వేదికగా జరుగుతుంది. తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 234 పరుగులకు ఆలౌట్ కాగా.. కివీస్ 715/6 వద్ద డిక్లేర్ చేసింది.