హరారే: వన్డే సిరీస్ ఓటమికి భారత్పై జింబాబ్వే తొలి ట్వంటీ20 మ్యాచులో ప్రతీకారం తీర్చుకుంది. భారత్ను రెండు పరుగుల తేడాతో ఓడించింది. విజయానికి భారత్ 20 ఓవర్లలో 171 పరుగులు చేయాల్సి ఉండగా, ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
మనీష్ పాండే (48) మినహా మిగతా భారత బ్యాట్స్మెన్ జింబాబ్వే బౌలర్ల ముందు నిలబడలేకపోయారు. వన్డేల్లో అదరగొట్టిన కెఎల్ రాహుల్ డకౌటయ్యాడు. కెప్టెన్ ధోనీ 17 బంతుల్లో 19 పరుగులు చేసి నాటౌట్గా మిగిలాడు. చివరలో అక్షర పటేల్ (9 బంతుల్లో 18 పరుగులు) అదరగొట్టినా ఫలితం కనిపించలేదు. రిషి ధావన్ 2 బంతుల్లో 1 పరుగు చేసి నాటౌట్గా మిగిలాడు. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని, చిబాబా రెండేసి వికెట్లు తీసుకోగా, తిరిపానో, మడ్జివాలకు చెరో వికెట్ దక్కాయి.
చివరి ఓవర్ ఉత్కంఠతో సాగింది. గేమ్ ఫినిషర్ ధోనీ ఉండడంతో జింబాబ్వేకి ఓటమి తప్పదనే అనుకున్నారు. కానీ పరిస్థితి తారుమారైంది. చివరి ఓవర్లో భారత్ 8 పరుగులు చేయాల్సి ఉండగా 5 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. ఆఖరి బంతికి 4 కొట్టాల్సిన స్థితిలో ధోనీ బ్యాటింగ్ చేస్తున్నాడు. అంతే ఒక్క కిక్తో బంతిని బండరీకి తరలించడానికి ప్రయత్నించాడు. కానీ ఫీల్డర్ సరిగ్గా బౌండరీ లైన్ వద్ద ఆపడంతో ధోనీ ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. దీంతో 2 పరుగులు తేడాతో టీం ఇండియా ఓటమిపాలైంది.

భారత్తో జరిగిన తొలి టి20లో జింబాబ్వే రెండు పరుగులతో విజయం సాధించడంలో ఆతిధ్య జట్టు బౌలర్ నెవిల్లే మద్జివా ప్రధనమైన పాత్ర పోషించాడు. చివరి ఓవర్లో భారత్ కు ఆరు బంతుల్లో 8 పరుగులు అవసరం కాగా ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి అక్షర్ పటేల్ వికెట్ తీశాడు.
చివరి బంతికి 4 పరుగులు అవసరం కాగా తన బౌలింగ్తో ధోనీని బోల్తా కొట్టించాడు. మద్జివా విసిరిన చివరి బంతిని ధోనీ కొట్టినా ఒక పరుగు మాత్రమే చేయగలిగాడు. ఫోర్ కానీ, సిక్సర్ కానీ కొడితే తప్ప గెలవలేని చివరి బంతిని ధోనీ కొట్టలేని విధంగా బౌలింగ్ చేసి మద్జివా జింబాబ్వేకు విజయం సాధించి పెట్టాడు.
జింబాబ్వే బ్యాట్స్మన్ చిగుంబురా తన బ్యాట్తో మెరుపులు మెరిపించడంతో తొలి ట్వంటీ20 మ్యాచులో జింబాబ్వే పెద్ద లక్ష్యాన్నే భారత్ ముందు ఉంచగలిగింది. భారత్ విజయానికి నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. చిగుంబురా ఏడు సిక్స్లు, ఒక ఫోర్ సాయంతో 26 బంతుల్లో 54 పరుగులు చేశాడు.

దాంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. మడ్జివా ఐదు పరుగులతో నాటౌట్గా మిగిలాడు. చిబాబా (20), మసకద్జా (25) మంచి ప్రారంభాన్ని అందించారు. సికిందర రాజా (20), వాలర్ (30) కూడా రాణించారు. భారత బౌలర్లలో బుమ్రాకు రెండు వికెట్లు లభించగా, రిషి ధావన్, అక్షర పటేల్, చాహల్లకు తలో వికెట్ లభించాయి.
మూడు మ్యాచుల ట్వంటీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచులో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శనివారంనాడు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఈ మ్యాచు ద్వారా ఐదుగురు కొత్త ఆటగాళ్లు ఆరంగేట్రం చేశారు.
జింబాబ్వేతో జరిగిన సిరీస్ ద్వారా కెఎల్ రాహుల్ ఆరంగేట్రం చేశాడు. అదే తరహాలో అతను ఇప్పుడు తన తొలి ట్వంటీ20 మ్యాచ్ ఆడుతున్నాడు. మన్దీప్ సింగ్, జయంత్ యాదవ్, ఉనద్కత్లు తమ తొలి అంతర్జాతీయ ట్వంటీ20 మ్యాచ్ ఆడుతున్నారు.
బౌలర్ రిషీ ధావన్ కూడా తొలి ట్వంటీ20 మ్యాచు ఆడుతున్నాడు. వన్డే మ్యాచుల్లో సత్తా చాటిన యజ్వేంద్ర చాహల్ కూడా టీ20లో ఆడుతున్నాడు. దీంతో ఐదుగురు భారత యువ క్రీడాకారులు ఒకేసారి టీ20లో ఆరంగేట్రం చేస్తున్నారు.
తుది జట్లు
భారత్: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), కెఎల్ రాహుల్, మన్దీప్ సింగ్, అంబటి రాయుడు, మనీష్ పాండే, జయంత్ యాదవ్, అక్షర్ పటేల్, రిషి ధావన్, బుమ్రా, ఉనద్కత్, చాహల్
జింబాబ్వే: క్రీమర్ (కెప్టెన్), చిబాబా, మసకద్జా, సికిందర్ రాజా, వాలర్, చిగుంబరా, ముతుంబామి, ముతోంబోడ్జి, ముజరాబాని, తిరిపానో