విజయవాడ: వెస్టిండిస్తో జరుగుతున్న మూడు వన్డేల సిరిస్లో భారత మహిళల క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. కృష్ణా జిల్లా మూలపాడులోని ఏసీఏ-కేడీసీఏ మైదానంలో గురువారం జరిగిన మ్యాచ్లో మిథాలీ రాజ్ నేతృత్వంలోని మహిళల జట్టు ఆరు వికెట్ల తేడాతో వెస్టిండిస్పై విజయం సాధించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు 42.4 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. వెస్టిండిస్ జట్టులో అగిలీరా (42 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచింది. ఇక భారత స్పిన్నర్లు రాజేశ్వరి గైక్వాడ్ (4/21), ఏక్తా బిస్త్ (3/14) దెబ్బకు వెస్టిండిస్ జట్టులో ఏకంగా 8 మంది సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరారు.

అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత జట్టు 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. భారత ఓపెనర్లు స్మృతి (7), దీప్తి (16)లతో పాటు మోనా (2), హర్మన్ప్రీత్ కౌర్ (1) స్వల్ప పరుగులకే పెవిలియన్కు చేరారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన వేద కృష్ణమూర్తి (52 నాటౌట్), మిథాలీ రాజ్ (46 నాటౌట్)తో జట్టును ఆదుకున్నారు.
వీరిద్దరూ చక్కటి సమన్వయంతో ఆడుతూ వెస్టిండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వేద దూకుడుగా ఆడుతూ విండీస్ బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఐదో వికెట్కు 97 పరుగులు జోడించిన వేద-మిథాలీ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరిస్లో భారత్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది.