
హైదరాబాద్: ఐసీసీ చాంపియన్ షిప్లో భాగంగా ముంబైలోని వాంఖడె స్టేడియంలో ఇంగ్లాండ్తో జరగనున్న తొలి వన్డేలో పర్యాటక జట్టుకు టీమిండియా 203 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య శుక్రవారం ప్రారంభమైన తొలి వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మహిళల జట్టు కెప్టెన్ హీథర్ టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది.
దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత మహిళల జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన (24) పరుగులకే పెవిలియన్కు చేరి నిరాశపరిచింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ (44)తో కలిసి మరో ఓపెనర్ రోడ్రిగ్స్(48) దూకుడుగా ఆడటంతో స్కోరు బోర్డు తేరుకుంది.
ఆ తర్వాత వీరిద్దరూ కూడా పెవిలియన్కు చేరడంతో భారత మహిళల జట్టు 92 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో జట్టుని ఆదుకోవాల్సిన మిడిలార్డర్ బ్యాట్స్మన్ చేతులెత్తేశారు. చివర్లో తాన్య భాటియా(25), గోస్వామి(30)లు రాణించడంతో భారత మహిళల జట్టు 49.4 ఓవర్లలో కేవలం 202 పరుగులకే ఆలౌటైంది.
గాయం కారణంగా ఈ సిరీస్కు దూరమైన హర్మన్ ప్రీత్ స్థానంలో జట్టులోకి వచ్చిన హర్లీన్ డియోల్(2) పూర్తిగా నిరాశపరిచింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఎల్విస్, సీవిర్, సోఫీ ఎలెక్స్టోన్లు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ష్రబ్షోల్ ఒక వికెట్ పడగొట్టింది. దీంతో భారత మహిళల జట్టు పర్యాటక జట్టుకు 203 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.