శ్రీలంకకు 1996లో తొలిసారి వన్డే ప్రపంచ కప్ను అందించిన మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అవినీతి కేసులో తీవ్రంగా ఇరుక్కున్నారు. 2017లో ఆయన పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఆయిల్ డీల్స్లో భారీ స్థాయిలో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఆయనను అరెస్ట్ చేయడానికి శ్రీలంక అధికారులు సిద్ధమయ్యారు.
అవినీతి ఆరోపణలు ఏమిటి?
2017లో అర్జున రణతుంగ పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయిల్ కొనుగోలుకు సంబంధించి జరిగిన డీల్స్లో ఆయన అవినీతికి పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అర్జున రణతుంగ సోదరుడు ధమికా రణతుంగ(సీలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్)తో కలిసి చమురు టెండర్లలో మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ధమికా రణతుంగ పెద్ద కాంట్రాక్టులు కాకుండా, తరచూ ఎక్కువ ధరలకు చమురును కొనుగోలు చేశారు. దీనివల్ల కొందరికి (కొన్ని సరఫరాదారులకు) లబ్ది చేకూరి, ప్రభుత్వానికి భారీగా ఆర్థిక నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు. శ్రీలంక అవినీతి నిరోధక కమిటీ (CIABOC) కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం.. 27 సార్లు చమురు కొనుగోళ్లలో జరిగిన ఈ అవకతవకల వల్ల శ్రీలంక ప్రభుత్వానికి 800 మిలియన్ల శ్రీలంక రూపాయలు (సుమారు రూ. 23 కోట్ల భారతీయ రూపాయలు) నష్టం జరిగింది.

అరెస్టుకు రంగం సిద్ధం
శ్రీలంక అధ్యక్షుడు ప్రస్తుతం అవినీతి వ్యతిరేక ప్రచారాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగానే అర్జున రణతుంగ పేరు తెరపైకి వచ్చింది. శ్రీలంక అధికారులు కొలంబో మెజిస్ట్రేట్ కోర్టుకు సమాచారం అందించారు. అర్జున రణతుంగ దేశానికి తిరిగి రాగానే అరెస్టు చేస్తామని కోర్టుకు తెలిపారు. రణతుంగ చివరిసారిగా నవంబర్ 2025లో శ్రీలంకలో కనిపించారు. ఈ వివాదం పెరిగిన తర్వాత ఆయన దేశం విడిచి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారనేది తెలియాల్సి ఉంది. రణతుంగ అన్నయ్య ధమికా రణతుంగ ఇప్పటికే అరెస్టు అయి, బెయిల్పై విడుదలయ్యారు.ఈ కేసు తదుపరి విచారణ 2026 మార్చి 13న జరగనుంది.
అర్జున రణతుంగ ప్రస్థానం
అర్జున రణతుంగ శ్రీలంక క్రికెట్కు అత్యంత గొప్ప, వివాదాస్పద పేర్లలో ఒకటి. 1996లో ఆయన కెప్టెన్సీలో శ్రీలంక తమ ఏకైక వన్డే ప్రపంచ కప్ను గెలుచుకుంది. 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఆయన 93 టెస్టులు, 269 వన్డేలు ఆడి 13,000కు పైగా పరుగులు చేశారు. క్రికెట్ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి, శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా, ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.