
హైదరాబాద్: తన అంతర్జాతీయ టెస్టు అరంగేట్రంపై యువ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ సంతోషం వ్యక్తం చేశాడు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో రాంచీ టెస్టుకు జార్ఖండ్కు చెందిన ఈ 30 ఏళ్ల షాబాజ్ నదీమ్ను సెలక్టర్లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తనకు భుజం నొప్పి ఎక్కువగా ఉందని కుల్దీప్ స్పష్టం చేయడంతో నదీమ్ను తీసుకున్నారు.
శుక్రవారం సాయంత్రం 7 గంటల వరకు కూడా నదీమ్కు భారత జాతీయ జట్టులో చోటు దక్కుతుందని తెలియదు. కర్ణాటకలో జరుగుతున్న విజయ్ హజారే టోర్నీలో అప్పుడే మ్యాచ్ ఆడి తన గదికి చేరుకున్నాడు. ఆ సమయంలోనే భారత జట్టు మేనేజ్మెంట్ నుంచి అతడికి ఫోన్ వచ్చింది. దీంతో నదీమ్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.
ఆ తర్వాత సరిగ్గా 14 గంటల అనంతరం రాంచీలోని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా అతడు తన టెస్టు క్యాప్ని అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ మూడో టెస్టుకు ముందు తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది.
ఈ సందర్భంగా షాబాజ్ నదీమ్ మాట్లాడుతూ "టీమిండియాకు ఆడాలన్న లక్ష్యంతో పదిహేనేళ్ల క్రితం ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాను. ఇన్ని రోజులకు తన కల తీరినందుకు సంతోషంగా ఉంది. సెలక్టర్లకు ధన్యవాదాలు" అని అన్నాడు. చాలాకాలంగా నదీమ్ జార్ఖండ్ జట్టు తరఫున దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నాడు.
రంజీల్లో వరుసగా రెండు సీజన్లలో వరుసగా 50కిపైగా వికెట్లు పడగొట్టాడు. జూలై-ఆగస్టు నెలల్లో వెస్టిండీస్-ఏతో అనధికారిక సిరీస్లో భాగంగా భారత-ఏ జట్టు తరఫున నదీమ్ అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి టెస్టులో 10 వికెట్లు తీసిన నదీమ్.. మూడో టెస్టులో ఐదు వికెట్లు సాధించాడు. 110 ఫస్ట్క్లాస్ మ్యాచుల్లో 424 వికెట్లు సాధించాడు.
19 సార్లు ఐదు వికెట్లు, 5 సార్లు 10 వికెట్ల ఘనత సాధించాడు. ఈ ప్రదర్శనే నదీమ్ను భారత జట్టులో ఎంపికయ్యేందుకు మార్గం సుగమం చేసింది. "ఎడమ భుజం నొప్పితో బాధపడుతున్నానని కుల్దీప్ యాదవ్ శుక్రవారం తెలియజేయడంతో నదీమ్ను ఎంపిక చేశాం" అని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు.
2018లో నదీమ్ను వెస్టిండీస్పై వన్డే, టీ20 సిరీస్కు ఎంపికైనప్పటికీ తుది జట్టులో చోటు దక్కలేదు. రాంచీ పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశం ఉండటంతో ఇషాంత్ను పక్కకు పెట్టి అతడి స్థానంలో నదీమ్కు చోటు కల్పించారు.