

ఐపీఎల్ సీజన్-12లో తొలి నాలుగు మ్యాచ్ల్లో ఓడినప్పటికీ వచ్చే మ్యాచ్లలో గెలుస్తామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేసారు. తొలి మూడు మ్యాచ్ల్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసి పాయింట్ల ఖాతాను తెరిచింది. మంగళవారం రాత్రి సవాయ్ మాన్సింగ్ మైదానంలో రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడారు.
మరిన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేది
'మ్యాచ్లో మేము గట్టి పోటీ ఇచ్చామనే అనుకుంటున్నా. మార్కస్ స్టోనిస్, మొయిన్ అలీ బాగా ఆడారు. మరో 15-20 పరుగులు చేసి ఉంటే బాగుండేది, అప్పుడు మరింత సవాలుగా ఉండేవి. ఇన్నింగ్స్ చివరలో వికెట్ నెమ్మదిగా మారినందున ఆ స్కోరు చేయడం అంత సులభం కాదు' అని విరాట్ తెలిపారు.
నిరాశ చెందాల్సిన అవసరం లేదు
మేము చేసిన కొన్ని తప్పుల వల్ల తొలి విజయం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఐపీఎల్ టోర్నమెంట్లలో ఇలాంటి ఆరంభాలను ఎవరూ కోరుకోరు. అయితే ఇలాంటివి సర్వసాధారణం. ప్రారంభం బాగుండనంత మాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇంకా 10 మ్యాచ్లు ఉన్నాయి.. వాటిల్లో విజయాలు సాధిస్తాం. జట్టు సభ్యులమంతా విజయానికి కావాల్సిన వ్యూహాలు రచిస్తాం. వచ్చే మ్యాచ్లలో గెలుస్తామనే నమ్మకం ఉంది' అని విరాట్ చెప్పుకొచ్చారు.