రీసెంట్ గా ముగిసిన ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఒక పరుగుకే ఔటై నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అయితే విరాట్ ఔట్ అవ్వగానే 14 ఏళ్ల బాలిక గుండెపోటుకు గురై.. కొద్దిసేపటికే ప్రాణాలను విడిచిందని వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఈ విషయమై చనిపోయిన ఆ బాలిక తండ్రి అజయ్ పాండే స్పందించారు. అసలు తన కూతురు ఎలా మరణించిందో వివరించారు.
అసలు ఏం జరిగిందంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గెలిచి విశ్వవిజేతగా నిలిచింది భారత జట్టు. దీంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా సంబరాలు చేసుకున్నారు. కానీ ఆ రోజు ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ కుటుంబంలో మాత్రం విషాదం నెలకొంది. 8వ తరగతి చదువుతోన్న 14 ఏళ్ల ప్రియాంశి.. తన కుటుంబంతో కలిసి మ్యాచ్ చూస్తూ గుండెపోటుకు గురై మరణించింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆడేటప్పుడు ఆటను ఆస్వాదించిన ఆ బాలిక, ఇండియా బ్యాటింగ్ చేస్తోన్నసమయంలో సడెన్ గా హార్ట్ ఎటాక్ తో కన్నుమూసింది. దీంతో వెంటనే కోహ్లీ సింగిల్ స్కోరుకే ఔట్ అవ్వగానే ప్రియాంశి చనిపోయిందని ప్రచారం సాగింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని బాలిక తండ్రి స్పష్టతనిచ్చారు. పాప అంత్యక్రియలు పూర్తయ్యాక ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

అప్పుడు బయట ఉన్నా..
"నేను ఇంటి బయట ఉన్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ అయిపోగానే మార్కెట్ కు వెళ్లాను. అప్పుడు ప్రియాంశి ఉన్నట్టుండి కుప్పకూలిందని ఫోన్ వచ్చింది. దీంతో పరుగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి, తనను తీసుకొని హాస్పిటల్ కు వెళ్లాను. తర్వాత నా కూతురు చనిపోయింది. విరాట్ కోహ్లీ వికెట్ పడిపోవడానికి, నా కూతురు చనిపోవడానికి సంబంధం లేదు. అది కోఇన్సిడెన్స్ మాత్రమే." అని బాలిక తండ్రి అజయ్ పాండే చెప్పారు. ఫైనల్గా తన కూతురు చనిపోయేటప్పుడు భారత జట్టు బాగానే ఆడుతోందని, కోహ్లీ అసలు బ్యాటింగ్కే దిగలేదని బాలిక తండ్రి స్పష్టత నిచ్చారు.